సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, డీఈ సస్పెన్షన్‌

11 May, 2020 20:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పోరేషన్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంవీ విద్యాసాగర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ముఖ్యమంత్రిపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ, సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ సోమవారం సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దుష్ప్రవర్తన, క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సస్పెండ్‌ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ... ‘డీఈ విద్యాసాగర్‌ తన మొబైల్‌ వాట్సాప్‌ గ్రూప్‌ల్లో కొన్ని ప్రభుత్వ వ్యతిరేక విషయాలను పోస్ట్‌ చేశారు. ముఖ్యమంత్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తన వాట్సాప్‌ గ్రూప్‌లలో విమర్శించారు. మా విచారణలో ఆధారాలతో సహా అవన్ని వాస్తవమని తేలాయి. ఉద్యోగులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో లేదా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. అతిక్రమిస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రవర్తనా నియమావళి ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం’ అని స్పష్టం చేశారు. 

చదవండి: ‘మా అమ్మ మంచి తల్లి, కానీ నేనే బ్యాడ్‌’ 

మరిన్ని వార్తలు