ఆర్థిక క్రమశిక్షణ వైపే అడుగులు

27 Jun, 2020 05:18 IST|Sakshi

అనేక రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం 

భవిష్యత్‌లోనూ వృధా వ్యయం వద్దు 

ప్రభుత్వ తోడ్పాటు అభినందనీయం 

ఏపీ ట్రాన్స్‌కో బోర్డు సమావేశం 

సాక్షి, అమరావతి: ఆర్థిక నిర్వహణలో మరింత పొదుపు పాటించాలని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సరఫరా సంస్థ (ఏపీ ట్రాన్స్‌కో) నిర్ణయించింది. చౌక విద్యుత్‌ కొనుగోళ్లు, వృధా వ్యయాన్ని తగ్గించడంపైనే రాబోయే కాలంలో దృష్టి పెట్టాలని తీర్మానించింది. ఏపీ ట్రాన్స్‌కో బోర్డు సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా ట్రాన్స్‌కో ఆర్థిక పరిస్థితిపై సమావేశంలో చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు.
 
► వృధాను అరికట్టడంలో గత ఏడాదిగా తీసుకున్న నిర్ణయాలు దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శ ప్రాయమైందని, ముందస్తు వ్యూహంతో చౌక విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్ల రూ.700 కోట్లు మిగిల్చినట్టు పేర్కొన్నారు.  
► తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్, యూపీ వంటి రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించేందుకు ఏపీని ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి తెలిపారు. ఈ విషయౖ మె ఆయా రాష్ట్రాలు సంప్రదించినట్టు వివరించారు. 
► గడచిన ఏడాదిలోనే రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు రూ.4,783.23 కోట్లు ఆదా చేయగలిగాయని శ్రీకాంత్‌ ప్రస్తావించారు. 2018–19లో రూ. 48,110.79 కోట్లున్న విద్యుత్‌ సంస్థల వ్యయాన్ని 2019–20 నాటికి రూ.43,437.56 కోట్లకు తగ్గించినట్టు తెలిపారు.  
► విద్యుత్‌ కొనుగోలుకు ముందే ప్రణాళిక రూపొందించడం వల్ల యూనిట్‌ రూ.1.63 నుంచి రూ.2.80 మధ్యే లభించిందని, ఇది విద్యుత్‌ సంస్థల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించిందని సమావేశం అభిప్రాయపడింది.  
► విద్యుత్‌ సంస్థలను నష్టాల నుంచి గట్టెక్కించే క్రమంలో ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును బోర్డు ప్రశంసించింది. గత ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ సబ్సిడీలకు ఈ ఏడాది రూ.11,311.70 కోట్లు విడుదల చేయడం, రూ.8,353.58 కోట్లు వ్యవసాయ సబ్సిడీ ఇవ్వడంపై ట్రాన్స్‌కో బోర్డు హర్షం వ్యక్తం చేసింది. 
► విద్యుత్‌ సంస్థల ఆర్థిక నిర్వహణ పర్యవేక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబును బోర్డు ప్రత్యేకంగా అభినందించింది.  
► విద్యుత్‌ సంస్థలకు రాష్ట్రం ఇస్తున్న సబ్సిడీ ఏ ఇతర రాష్ట్రాల్లోనూ ఇవ్వడం లేదని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎస్‌ఎస్‌ రావత్‌ గుర్తు చేశారు.  

మరిన్ని వార్తలు