వృద్ధి రేటులో దేశాన్ని మించిపోయాం: సీఎం

30 Mar, 2018 01:39 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆర్థిక లోటుతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్‌ వృద్ధిరేటులో దేశాన్నే మించి పోయిందని  ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలోని నోవాటల్‌లో గురువారం జరిగిన ఐఐఎం విశాఖ రెండో స్నాతకోత్సవంలో ఐఐఎం చైర్మన్‌ హరి ఎస్‌.భార్టియాతో కలిసి ఎంబీఏ విద్యార్థులకు పట్టాలు, గోల్డ్‌మెడల్స్‌ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా భారతదేశం రెండంకెల వృద్ధి రేటు కోసం తీవ్రంగా కృషి చేస్తుంటే ఏపీ మాత్రం డబుల్‌ డిజిట్‌ గ్రోత్‌ రేటు సాధించగలిగిందన్నారు.

నాలుగేళ్లుగా ఎన్నో సవాళ్లు, మరెన్నో అవరోధాలను అధిగమించి 10.25 శాతం వృద్ధి రేటు సాధించగలిగామన్నారు. విశాఖ సాగరతీరంలో నాలుగు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన యాటింగ్‌ ఫెస్టివల్‌ను జెండాఊపి సీఎం ప్రారంభించారు. కాగా, ఏసుక్రీస్తు శాంతి బోధనలతో ప్రపంచాన్నే ప్రభావితం చేశారని, ఆయన త్యాగానికి ప్రతీకని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గుడ్‌ ఫ్రైడే సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 

మరిన్ని వార్తలు