యరపతినేనిపై సీబీఐ విచారణకు ఆదేశం

24 Dec, 2019 20:20 IST|Sakshi

అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ

ఉత్తర్వులు జారీచేసిన ఏపీ ప్రభుత్వం

సాక్షి, అమరావతి : మైనింగ్ కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై ఉన్న కేసులన్నింటినీ సీబీఐకి అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యరపతినేనిపై ఉన్న 18 కేసులపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ మంగళవారం రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లాలోని కోణంకి, కేసనుపల్లి, నదికుడి గ్రామాల్లో అక్రమ మైనింగ్ పై విచారణ జరపాలని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొంది. కాగా, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో యరపతినేని అక్రమంగా మైనింగ్ చేపట్టారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. (గ్రానైట్‌ అక్రమ రవాణా సూత్రధారి యరపతినేని!)

2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారంటూ విమర్శలు ఎదురర్కొన్నారు. దీంతోనే గత ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు.  మరోవైపు రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అక్రమ వ్యవహారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాసిన లేఖపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ స్పందించిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో హోం మంత్రిత్వ శాఖ సదరు లేఖను సంబంధిత శాఖలకు పంపించింది. దీంతో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి వ్యవహారాలపై ఏ క్షణంలోనైనా విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధమైంది.

మరిన్ని వార్తలు