హైదరాబాద్: వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీని ప్రారంభించే ముందు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ( ఏపీపీఎస్సీ) కొత్త నోటిఫికేషన్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కోరింది. దీనిపై స్పష్టత వచ్చేంత వరకు ఎలాంటి నోటిఫికేషన్ ఉండబోదంటూ ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. అయితే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేయాలని ఏపీపీఎస్సీ గతంలో భావించినా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రకటన ఆలస్యమైంది.
ఇదిలా ఉండగా ఆగస్టులో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే మళ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఆ తరువాత నవంబరు నుంచి సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న వాదనల నేపథ్యంలో ఈ ఆందోళన నెలకొంది. ఎన్నికల కోడ్ అమలులో లేని తేదీల్లో పరీక్షల షెడ్యూ ల్ జారీ చేస్తే... ఆ తరువాత కోడ్ అమల్లోకి వచ్చినా నోటిషికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు ఎదురుకావని అధికారులు భావిస్తున్నారు.