ఏపీఎస్‌ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్‌

31 Dec, 2018 15:41 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో(ఏపీఎస్‌ఆర్టీసీ) సమ్మె సైరన్‌ మోగింది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గుర్తింపు కార్మిక సంఘం ఎంప్లాయిస్‌ యూనియన్‌(ఈయూ) నేతలు సోమవారం ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబుని కలిసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సమ్మె నోటీసుకు స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ కూడా మద్దతు ప్రకటించింది.

ఈ నోటీసులో ఆర్టీసీ కార్మికులు తమ ప్రధాన డిమాండ్లను ప్రస్తావించారు. 50 శాతం వేతన సవరణతో పాటు అలవెన్సులు వంద శాతం పెంచాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నోటీసులో పేర్కొన్నారు. సంస్థ నష్టాలకు అనుగుణంగా ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ఆర్టీసీ కార్మికుల పదవి విరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచాలన్నారు. ఆర్టీసీ కొనుగోలు చేసే డీజిల్‌పై రాయితీ ఇవ్వాలని, ఖాళీ ఉద్యోగాల భర్తీ, కార్మికుల ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. బలవంతంగా అమలు చేస్తున్న వీఆర్‌ఎస్‌ స్కీమ్‌ ఆపాలన్నారు.

మరిన్ని వార్తలు