ఆక్వాకు ఊపిరి

7 Apr, 2020 03:58 IST|Sakshi

ఈ నెల 6వ తేదీ వరకు కొనుగోలు చేసిన రొయ్యలు 5,819.3 మెట్రిక్‌ టన్నులు

6వ తేదీ వరకు విదేశాలకు ఎగుమతి అయిన రొయ్యలు 3,695 మెట్రిక్‌ టన్నులు

ఊపందుకున్న రొయ్యల కొనుగోళ్లు

చైనా, మలేషియా, సింగపూర్, కెనడా తదితర దేశాలకు ఎగుమతులు 

రెవెన్యూ, మత్స్యశాఖ పర్యవేక్షణలో కొనుగోళ్లు

హర్షం వ్యక్తం చేస్తున్న ఆక్వా రైతులు 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఆక్వా రంగానికి ఊపిరి పోస్తోంది. లాక్‌ డౌన్‌ కారణంగా నిలిచిపోయిన రొయ్యల కొనుగోళ్లు తిరిగి ఊపందుకున్నాయి. ఇతర దేశాలకూ ఎగుమతులు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన ధరలకు ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్వాహకులు రొయ్యలను కొనుగోలు చేస్తున్నారు. చెరువుల పట్టుబడి, రొయ్యల కొనుగోళ్లలో గ్రామ సచివాలయ సిబ్బంది ముఖ్య భూమిక పోషిస్తూ రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. జిల్లా కలెక్టర్లు ప్రతిరోజూ కొనుగోళ్లపై సమీక్షలు నిర్వహిస్తూ రెవెన్యూ, మత్స్య శాఖలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రాసెసింగ్‌ ప్లాంట్ల నిర్వాహకులు ఎదుర్కొంటున్న కార్మికులు, ప్యాకింగ్‌ సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుండటంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గత నెల 30వ తేదీ నుంచి ఈ నెల 6వ నాటికి రాష్ట్రంలోని 73 ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్వాహకులు 5,819.3 మెట్రిక్‌ టన్నుల రొయ్యల్ని కొనుగోలు చేశారు. వాటిని ప్రాసెసింగ్‌ చేసి చైనా, మలేషియా, సింగపూర్, కెనడా, సౌత్‌ కొరియా, వియత్నాం దేశాలకు ఎగుమతి ప్రారంభించారు. విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవుల నుంచి సోమవారం వరకు 233 కంటైనర్ల ద్వారా 3,695 మెట్రిక్‌ టన్నుల రొయ్యలు ఎగుమతి అయ్యాయి.

ముఖ్యమంత్రి ఆదేశాలతో..
► సరిగ్గా 15 రోజుల క్రితం ఆక్వా రైతులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆక్వా సమస్యలను విన్నవించారు. 
► తక్షణమే స్పందించిన సీఎం ప్రాసెసింగ్‌ ప్లాంట్ల నిర్వాహకులు, వ్యాపారులతో సమీక్ష జరపటంతో రొయ్యల కొనుగోళ్లు మొదలయ్యాయి.
​​​​​​​► ప్రాసెసింగ్‌ ప్లాంట్లలోని కార్మికుల సమస్యలను అధికారులు పరిష్కరించి, వాటిల్లో ప్రాసెసింగ్‌ కార్యక్రమాలు ఉపందుకునేలా చేశారు.  
​​​​​​​► గతంలో కొనుగోలు చేసిన రొయ్యలను కూడా ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రాసెసింగ్‌ ప్లాంట్ల నిర్వాహకులు ఇతర దేశాలకు ఎగుమతి చేశారు.

గతంలో పరిస్థితి ఇలా..
​​​​​​​► కరోనా వైరస్‌ ఉధృతి నేపథ్యంలో ఎగుమతులు లేక రాష్ట్రంలోని ఆక్వా ప్రాసెసింగ్‌ ప్లాంట్లు మూతపడ్డాయి.
​​​​​​​► ఇదే సమయంలో రొయ్యల చెరువులు పట్టుబడికి రాగా.. ప్లాంట్ల నిర్వాహకులు కొనుగోలుకు ముందుకు రాలేదు.
​​​​​​​► స్థానిక మార్కెట్లలో 100 కౌంట్‌ రొయ్యలకు రూ.100 లోపే ధర పలకగా.. ఎకరాకు కనీసం రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లే దుస్థితి ఏర్పడింది.

ప్రస్తుత పరిస్థితి ఇదీ
​​​​​​​► ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు గ్రామ సచివాలయ సిబ్బందిని, జిల్లా స్థాయి అధికారులను అప్రమత్తం చేశారు. 
​​​​​​​► గ్రామ సచివాలయ సిబ్బంది తమ పరిధిలో పట్టుబడికి వచ్చిన చెరువుల వివరాలను సేకరించి అధికారులకు నివేదిస్తున్నారు.
​​​​​​​► అధికారులు ప్రాసెసింగ్‌ ప్లాంట్ల నిర్వాహకులతో చర్చించి.. చెరువుల్లోని సరుకును కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తున్నారు.
​​​​​​​► కొన్ని ప్రాసెసింగ్‌ ప్లాంట్లు కార్మికుల కొరత వల్ల ఇంకా తెరుచుకోలేదు. అధికారులు రంగంలోకి దిగి కార్మికులతో చర్చలు జరిపి ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు.
​​​​​​​► మరోసారి అధికారులు, మంత్రులు జిల్లాల్లో పర్యటించిన క్షేత్రస్థాయిలో రొయ్యల కొనుగోళ్లు సక్రమంగా జరుగుతున్నాయో లేదో పరిశీలించాలని సీఎం ఆదేశించారు. 
​​​​​​​► ప్రభుత్వం ప్రకటించిన ధరల ప్రకారం.. ఈ నెల 30న రొయ్యల ఎగుమతికి సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 
​​​​​​​► రాష్ట్రంలోని విశాఖ, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవులకు ప్రాసెస్‌ చేసిన రొయ్యలను పంపిస్తున్నారు.

జిల్లాల వారీగా పని చేస్తున్న ప్రాసెసింగ్‌ ప్లాంట్లు, కొనుగోలు చేసిన రొయ్యలు 

మరిన్ని వార్తలు