అక్కడ పదిరెట్ల కాలుష్యం ఎక్కువ

31 Mar, 2017 14:07 IST|Sakshi

మొగల్తూరు ఘటనలో ఐదు నిండు ప్రాణాలు బలైపోయాయని, ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా తుందుర్రులో తలపెడుతున్న మెగా ఆక్వా ఫుడ్ పార్కుకు మొగల్తూరు ఫ్యాక్టరీ కంటే పదిరెట్లు ఎక్కువ సామర్థ్యం ఉందని, అక్కడి నుంచి పది రెట్లు ఎక్కువ కాలుష్యం వస్తుందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ అంశంపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు జరిగిన చర్చలో ఆయన వివరంగా మాట్లాడారు. మధ్యమధ్యలో మంత్రి అచ్చెన్నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినా దానికి దీటుగా సమాధానం ఇస్తూనే ఆక్వా పరిశ్రమ వల్ల కలుగుతున్న నష్టాలను ప్రస్తావించారు. ఆయన ఏమన్నారంటే..

  • మొగల్తూరు ఘటన మీద మంత్రి ప్రకటన చేశారు.. ఈ ప్రకటనలోని కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నాను
  • ట్రీట్‌మెంట్ ప్లాంటు ఉంటే, అన్నిరోజుల పాటు వ్యర్థాలను ఎందుకు నిల్వ చేశారు?
  • ట్రీట్‌మెంట్ ప్లాంటు ఉండి, దాన్ని ఉపయోగించే ఆలోచనే వాళ్లకు ఉంటే గొంతేరు డ్రెయిన్‌కు పైపులు ఎందుకు వేశారు?
  • ఆ పైప్‌లైన్లు తీసేయమని కాలుష్య నియంత్రణ మండలి చెప్పింది
  • 2014లోనే పరిశ్రమ పెట్టినప్పుడు 2016లో పీసీబీ అక్కడకు వెళ్లి పైపులైన్లు తీసేయమని చెప్పింది.. అంటే రెండేళ్ల పాటు డ్రెయిన్‌లోకి వ్యర్థాలు పంపించినట్లే కదా?
  • రెండేళ్లుగా ఆ పైపులు వేసి గొంతేరు డ్రెయిన్‌కు పైపుల ద్వారా కాలుష్యాన్ని నింపేయడం వల్లే పీసీబీ వాటిని తీసేయమందని మీరే చెప్పారు
  • ఆనంద్ ఫుడ్స్ యాజమాన్యానికే తుందుర్రులో అనుమతి ఇచ్చారు. ఇక్కడిది మొగల్తూరు కన్నా పది రెట్ల సామర్థ్యం ఎక్కువ
  • అంటే కాలుష్యం కూడా పదిరెట్లు ఎక్కువగా వస్తుంది
  • ఈ రెండేళ్లుగా ప్రజలు ఇవన్నీ చూసే తమకు ఈ పరిశ్రమ వద్దని ఆందోళన చేస్తున్నారు
  • గతంలో దీన్ని జీరో పొల్యూషన్ అన్నారు, దానికి సంబంధించి చంద్రబాబు ఏకంగా ప్రెస్‌లో స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు
  • మీరు ఈవాళ ఇచ్చిన ప్రకటనలో మాత్రం ఈ ఘటన జరిగిన తర్వాత ప్లేటు మార్చి ఇది ఆరంజ్ కేటగిరీలోకి వస్తుందన్నారు
  • కాలుష్యానికి సంబంధించి రెడ్, ఆరంజ్, గ్రీన్, వైట్ అని నాలుగు విభాగాలు ఉంటాయి
  • మొన్నటివరకు జీరో పొల్యూషన్ అని, ఇప్పుడు ఆరంజ్ కేటగిరీ అంటున్నారంటే మీ స్టాండ్‌లో తేడా కనిపిస్తోంది
  • యాజమాన్యం నిర్లక్ష్యం గురించి ప్రకటనలో ఒక్క మాట కూడా చెప్పలేదు
  • (ఈ సమయంలో అచ్చెన్నాయుడు కలగజేసుకుని ప్రసంగానికి ఆటంకం కలిగించారు. పరిశ్రమలకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంటుకు బదులు ఆయన కామన్ ఎఫెక్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంటు అని చెప్పారు)
  • ఇక్కడ ఏం సూచనలిచ్చినా నిర్మాణాత్మకంగా ఉండాలని చెబుతాం తప్ప ఆటంకం కలిగించాలన్న ఉద్దేశం లేదు
  • మంత్రిగారిని ముందు ఇంగ్లీషు సరిచేసుకోమని చెప్పండి.. అది కామన్ ఎఫెక్ట్ ట్రీట్‌మెంట్ ప్లాంటు కాదు, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంటు

(ఈ సందర్భంలోనే మంత్రి అచ్చెన్నాయుడు మళ్లీ లేచి వైఎస్ జగన్ మీద, ఆయన విద్యార్హతల మీద వ్యక్తిగత విమర్శలు చేశారు)

  • ఈ అంశంపై మెజిస్టీరియల్.. అంటే ఆర్డీవోతో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు, దాన్నిబట్టే వీళ్లకు ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది
  • పరిశ్రమలు రాకూడదని ఎవరికీ లేదు.. యాజమాన్యంతో కూడా నాకు ఎలాంటి విభేదాలు లేవు
  • పరిశ్రమలు పెట్టాల్సిన చోట పెట్టాలి. వీటిని సముద్రతీరంలో పెడితే అందరూ ఆహ్వానిస్తారు.
  • కానీ ఈవాళ వాళ్లు గొంతేరు డ్రెయిన్ పక్కన పెట్టారు
  • అక్కడ పది వేల మంది ప్రజలు నివాసం ఉంటారు
  • అక్కడకు క్లీనింగ్ చేయడానికి వెళ్లిన ఐదుగురు కార్మికులు ఒక్క మాట కూడా మాట్లాడకుండా చనిపోయారు
  • అలాంటిది పదివేల మంది ఉండేచోట ఇలాంటి ప్రాజెక్టే పెడతామంటున్నారు
  • పొరపాటు ఏమైనా జరిగితే ఎన్నివేల మంది చనిపోతారో ఆలోచించాలని చెబుతున్నా
  • ఇది ప్రైవేటు కంపెనీ.. దీనికి పైప్ లైను ఎవరు వేస్తారు?
  • అక్కడి నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉంది.. దానికి ఖర్చు ఎవరు పెట్టుకుంటారు
  • ప్రభుత్వమే డబ్బు పెట్టేటట్లయితే కంపెనీ మీద ఎందుకంత ప్రేమ
  • వాళ్లే పైపులైను వేసేటట్లయితే దానికి కనీసం 40 కోట్ల ఖర్చవుతుంది
  • గ్రామాలలో ఎవరూ భూములు ఇవ్వరు. ఆ పైపులైన్లు ఊళ్ల మధ్య నుంచి పోతాయి.. ఎక్కడైనా లీకైతే పరిస్థితి ఏంటని భూములు ఇవ్వరు
  • పైపులైన్ల లెవెల్స్ ఎలా ఉన్నాయని చూస్తే.. ఈమధ్యే నాగార్జున వర్సిటీ బృందం అక్కడ పరిశీలనకు వెళ్లింది
  • తుందుర్రు, బేతపూడి గ్రామాలు సముద్ర మట్టం కన్నా తక్కువ ఎత్తులో ఉన్నాయని వాళ్లు చెప్పారు
  • ఫ్యాక్టరీ చుట్టూ ఇతరుల పొలాలున్నాయి, రెండువైపులా ఊళ్లు, తర్వాత గొంతేరు డ్రెయిన్ ఉన్నాయి
  • విషవాయువులు, ప్రమాదకరమైన గ్యాస్ అన్నీ ఆ పైపులైన్ నుంచే వెళ్తాయి.. అలాంటి పైపులు వేయడానికి ఎవరైనా ఎందుకు ఒప్పుకొంటారు
  • దాని బదులు ఇదే ఫ్యాక్టరీని తీరప్రాంతంలోకి తీసుకెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా
  • ఐదుగురు మనుషులు చనిపోతే అదేశాఖకు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు కనీసం అక్కడకు వెళ్లలేదు, ముఖ్యమంత్రి కూడా వెళ్లడానికి తీరిక లేదు
  • అక్కడ ఐదుగురు చనిపోయినా, బస్సు ప్రమాదంలో పదిమంది మరణించినా ముఖ్యమంత్రికి కనిపించదు.. కనీసం మానవత్వం అనేది చూపించాలి
  • గొంతేరు డ్రెయిన్‌కు 30 వేల ఎకరాల ఆయకట్టు ఉంది
  • యనమదుర్రు డ్రెయిన్ పూర్తిగా కాలుష్యం అయిపోయి, అది తాగునీటికి, సాగునీటికి కూడా పనికిరాకుండా పోయింది
  • గొంతేరు డ్రెయిన్ పరిస్థితి కూడా అలాగే తయారవుతుందన్న ఆందోళనలో స్థానికులు ఉన్నారు
  • ఇదే చంద్రబాబు ఆక్వా ఫుడ్ పార్కుకు మద్దతిస్తూ.. 37 మంది మీద హత్యాయత్నం కేసులు పెట్టారు


(ఈ సమయంలో మళ్లీ అధికార పక్షానికి మైకు ఇవ్వడంతో ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పోడియం వద్దకు వెళ్లి మైకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు)