పోలవరంపై ఎన్జీటీలో విచారణ

27 Sep, 2019 13:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్‌ డంపింగ్‌ వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ వేసి పర్యావరణానికి ముప్పు తెస్తున్నారని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో దాఖలైన పిటిషన్‌ను ఏకే గోయల్‌ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తుంటే ఎందుకు పట్టించుకోవట్లేదని కేంద్ర పర్యావరణ శాఖ తరపు న్యాయవాదిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎవరు పర్యవేక్షిస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించగా, రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షిస్తుందని సమాధానమిచ్చారు. దాంతో ప్రాజెక్టు అథారిటీ సీఈవో హాజరుకావాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్‌ 7కు వాయిదా వేసింది. అంతేకాకుండా పొంగులేటి సుధాకర్‌ రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌లో వరద ముంపు ప్రధాన అంశంగా ఉందని, పోలవరం డంపింగ్‌ కేసుతో పాటే వరద ముంపు పిటిషన్‌ను కూడా విచారిస్తామని ఎన్జీటీ స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు