రమేష్‌ కుమార్‌ పిటిషన్‌పై హైకోర్టులో కీలక వాదనలు

20 Apr, 2020 13:41 IST|Sakshi

ప్రిలిమినరీ కౌంటర్ మాత్రమే దాఖలు చేశామన్న ఏజీ

నాలుగురోజుల సమయం ఇచ్చిన హైకోర్టు

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తొలగింపు వ్యవహారంపై హైకోర్టులో కీలక వాదనలు సాగాయి. ఈసీ పదవీ కాలం తగ్గింపు, పంచాయతీరాజ్‌ చట్టంలో మార్పులు వంటి ప్రభుత్వ నిర్ణయాలను సవాలు చేస్తూ రమేష్‌ కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం గత శనివారం కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఇరువురి పిటిషన్లపై సోమవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్‌ జనరల్‌.. రమేష్‌ కుమార్‌ పిటిషన్‌కు కేవలం ప్రిలిమినరీ కౌంటర్ మాత్రమే దాఖలు చేశామని కోర్టుకు తెలిపారు. పూర్తి స్థాయి అఫిడవిట్‌ దాఖలు చేయడానికి సమయం కావాలని ఏజీ అభ్యర్థించారు. (రమేష్‌ కుమార్‌ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు)

దీంతో పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం నాలుగురోజుల సమయం ఇచ్చింది (శుక్రవారం లోపు కౌంటర్లు వేయాలి). దానితో పాటు మిగతా పిటిషన్లకు కూడా కౌంటర్లు వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇక ఈ లోపు కొత్త ఎన్నికల కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆపాలని రమేష్‌ కుమార్‌ తరఫు న్యాయవాది హైకోర్టును కోరారు. ఇప్పటికే ఆరు వారాలపాటు ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది కాబట్టి ఎన్నికలపై ముందుకెళ్ళే అవకాశం లేదన్న కోర్టు సమాధానమిచ్చింది. ఇరువురి పిటిషన్లకు సంబంధించి తుది ఆదేశాలు ఈనె 28న ఇస్తామని  ధర్మాసనం స్పష్టం చేసింది.
 

మరిన్ని వార్తలు