కాశ్మీర్లో వీర మరణం పొందిన పాలమూరు ఆర్మీ జవాను యాదయ్య భౌతికకాయం గురువారం హైదరాబాద్
చేరుకుంది. యాదయ్య మృతదేహానికి ఆర్మీ అధికారులు ఘన నివాళి అర్పించారు. సంతాప సూచకంగా సైనికులు గాల్లోకి తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించారు. జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్లో సోమవారం ఆర్మీ కాన్వాయిపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో యాదయ్య మృతి చెందిన విషయం తెలిసిందే.
మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన మల్లెపాకుల యాదయ్య 2003లో ఇంటర్మీడియట్ పూర్తవగానే ఆర్మీలో ఉద్యోగం సంపాదించాడు. అప్పటినుంచి కాశ్మీర్లో విధులు నిర్వర్తిస్తూ గ్రామానికి అప్పుడప్పుడు వచ్చివెళ్లేవాడు. 2009లో యాదయ్యకు వివాహమవగా భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి యాదయ్య మృతదేహన్ని అతని స్వస్థలం కొండారెడ్డిపల్లికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆంధ్ర సబ్ ఏరియా మిలటరీ లాంఛనాలతో యాదయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.