యువసంద్రం..

22 Jan, 2014 03:01 IST|Sakshi

సాక్షి, కొత్తగూడెం: ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కు తరలివచ్చిన యువతతో మంగళవారం ప్రకాశం స్టేడియం కిక్కిరిసింది. సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టులకు ఆదిలాబాద్, వరంగల్, రంగారెడ్డి జిల్లా నుంచి భారీగా యువత తరలి వచ్చారు. ఇప్పటివరకు జరిగిన నాలుగురోజుల ఎంపికల్లో అత్యధికం గా మంగళవారం 5,804 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ అభ్యర్థులతో మంగళవారం తెల్లవారుజాము నుంచే ప్రకాశం స్టేడియం పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
 
 తెల్లవారుజామున రెండు గంటల నుంచే అభ్యర్థులు టోకెన్ల కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన క్యూలో నిల్చునేందుకు బారికేడ్ల లో బస చేశారు. పోస్టాఫీస్ సెంటర్, బస్టాండ్, కోర్టు ఏరియా, కొత్తగూడెం క్లబ్ ప్రాంతాలన్నీ యువత బసకేంద్రాలుగా మారాయి. ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు ఆర్మీ ర్యాలీకి హాజరుకావడం గమనార్హం. అనూహ ్య రీతిలో అభ్యర్థులు తరలిరావడంతో తెల్లవారుజామున మూడు గంటల నుంచే టోకెన్లు ఇవ్వడం ప్రారంభించారు. ఈ ప్రక్రియ ఉదయం 8.30 గంటల వరకు కొనసాగినప్పటికీ ఇంకా చాలామంది అభ్యర్థులకు టోకెన్లు అందకపోవడంతో నిరాశకు గురై వెనుతిరిగారు.
 
 భారీగా అభ్యర్థులు హాజరుకావడంతో ఎంపిక ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగి సాయంత్రం ముగిసింది. ఉదయం 10 గంటల తర్వాత నిర్వహించిన పరుగుపందెంలో చాలామంది అభ్యర్థులు నీరసించి అర్హత సాధించలేకపోయారు. 5,804 మంది హాజరుకాగా వీరిలో 2,053 మంది ఎత్తుకొలతలో తిరస్కరణకు గురయ్యారు. కాగా 3,751 మంది పరుగుపందేనికి ఎంపికైతే ఇందులో 930 మంది అర్హత సాధించారు. ఎండతీవ్రత, నాలుగు రౌండ్లు పరుగుపందెంతో అభ్యర్థులు నీరసించిపోయారు. దీంతో పరుగుపందెంలోనే 2,821 మంది అనర్హులయ్యారు.
 
 ఏర్పాట్లను పరిశీలించిన బ్రిగేడియర్ సజ్జన్..
 సోల్జర్ జనరల్ డ్యూటీ ఎంపిక తీరును ఆర్మీ బ్రిగేడియర్ సజ్జన్ స్వయంగా పరిశీలించారు. ప్రకాశం మైదానంలో ఎత్తు, బరువు, పుల్‌అప్స్, ఎంపికైన అభ్యర్థుల వివరాలను కంప్యూటర్‌లో చేర్చే శిబిరాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. స్పృహతప్పి పడిపోతున్న అభ్యర్థులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై ఆర్మీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొత్తగూడెంలో ర్యాలీ విజయవంతం కావడంలో సింగరేణి, జిల్లా అధికారుల కృషి ప్రశంసనీయమని అభినందించారు. అలాగే స్థానిక సూర్యోదయ పాఠశాల విద్యార్థులు ఆర్మీ ర్యాలీని తిలకించేందుకు రాగా వారితో బ్రిగేడియర్ సజ్జన్ మాట్లాడుతూ ఆర్మీ రిక్రూట్‌మెంట్ గురించి తెలుసుకునేందుకు వచ్చిన విద్యార్థులను అభినందించారు. బుధవారం సోల్జర్ జనరల్‌డ్యూటీ పోస్టులకు నిజామాబాద్, కరీంనగ ర్, మహబూబ్‌నగర్ జిల్లాల అభ్యర్థులకు ఎంపికలు జరగనున్నాయి. ఈ ర్యాలీని ఆర్మీ రిక్రూట్‌మెంట్ సెల్ డెరైక్టర్ యోగేష్ ముదిలియార్, కొత్తగూడెం డీఎస్పీ రంగరాజు భాస్కర్, సింగరే ణి జీఎం (పర్సనల్) కె.బాబు సత్యసాగర్, వన్‌టౌన్ సీఐ ఎ.నరేష్ కుమార్‌లు పర్యవేక్షించారు.

మరిన్ని వార్తలు