ఏపీసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

18 Nov, 2013 00:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఏపీసెట్-13 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష రాసేందుకు సహాయకులు అవసరమైన వికలాంగ, అంధ అభ్యర్థులు  తమ వివరాలను వారం రోజులు ముందుగా తెలియజేస్తే స్క్రైబ్స్‌ను ఏర్పాటు చేస్తామని ఏపీసెట్ కార్యదర్శి ప్రొఫెసర్ బి.రాజేశ్వర్‌రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మూడు విభాగాలుగా జరిగే పరీక్షకు 1,26,785 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
 
  లైఫ్ సైన్స్, కెమిస్ట్రీ, మేనేజ్‌మెంట్, తెలుగు, ఫిజిక్స్ తదితర సబ్జెక్టులకు అభ్యర్థులు ఎక్కువగా ఉంటే.. జాగ్రఫీలో అతి కొద్ది మంది మాత్రమే పరీక్ష రాయబోతున్నారు. సజావుగా పరీక్షరాసేందుకు అభ్యర్థులకు రాజేశ్వర్‌రెడ్డి పలు సూచనలు చేశారు. ‘మూడు విభాగాలుగా జరిగే పరీక్షలో మొదటి పేపర్‌లో 60 ప్రశ్నలకు 50 రాయాలి. కాబట్టి అభ్యర్థులు కేవలం 50 ప్రశ్నలకు మాత్రమే జవాబులివ్వాలి.  ఇప్పటికీ హాల్ టికెట్‌లు అందని, స్క్రైబ్స్ అవసరమైన అభ్యర్థులు తమ వివరాలను 040 27097733 నంబరుకు ఫోన్ చేసి పరిష్కారం పొందవచ్చు. apset2012 @gmail.com ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు’ అని సూచించారు.

మరిన్ని వార్తలు