సమైక్య భేరికి సన్నద్ధం.. జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ

24 Oct, 2013 05:11 IST|Sakshi
సమైక్య భేరికి సన్నద్ధం.. జిల్లా నేతలతో వైఎస్ జగన్ భేటీ

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ‘సమైక్య భేరి’కి జిల్లా నుంచి జన సమీకరణపై పార్టీ నేతలు దృష్టి సారించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాకు చెందిన పార్టీ నేతలతో హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టి జగపతితో పాటు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ‘సమైక్య’ ఉద్యమం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజలు, పార్టీ నేతల ప్రయోజనాలకు సంపూర్ణంగా పరిరక్షిస్తుందని జగన్ హామీనిచ్చినట్లు సమాచారం. సమైక్య రాష్ట్రంలోనే వచ్చే ఎన్నికలు జరిగే అవకాశమున్నందున పార్టీ బలోపేతం చేసేందుకు పార్టీ నేతలు కృషి చేయాల్సిందిగా వైఎస్ జగన్ సూచించినట్లు తెలిసింది.

ఈ నెల 26న హైదరాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ‘సమైక్య భేరి’ సభకు హైదరాబాద్‌కు పొరుగునే ఉన్న పటాన్‌చెరు, సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు తదితర నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు వెల్లడించారు. సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్, ఉజ్వల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నర్ర భిక్షపతి, సతీష్‌గౌడ్, బిడకన్నె హన్మంతు, మాణిక్‌రావు, రామాగౌడ్, దేశ్‌పాండే, ప్రభుగౌడ్, కొమ్మెర వెంకట్‌రెడ్డి, ఎల్లు రవీందర్‌రెడ్డి, డాక్టర్ శ్రావణ్‌కుమార్ రెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు