సచివాలయ పరీక్షలకు సై..

31 Aug, 2019 09:57 IST|Sakshi

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు  

198 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ

పర్యవేక్షణకు అధికారులు, సిబ్బంది నియామకం

1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు

నిమిషం ఆలస్యమైనా అనుమతించరు 

సాక్షి, విజయనగరం గంటస్తంభం: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నడుం బిగించారు. ఇందులో భాగంగా గాంధీజీ కలలు సాకారం చేసేందుకు అక్టోబర్‌ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గ్రామస్థాయి నుంచి వ్యవస్థను పటిష్టపరిచేందుకు సచివాలయ ఉద్యోగుల నియామకానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు తేదీలు ఖరారు చేసింది. కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి 8వ తేదీవరకు నిర్వహించే పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎస్పీ, జాయింట్‌ కలెక్టర్‌ వారిని వైస్‌ చైర్మన్‌గా,  జెడ్పీ సీఈవో మెంబర్‌ కన్వీనర్‌గా, జాయింట్‌ కలెక్టర్‌ –2, మరో 13 మంది జిల్లా అధికారులను సభ్యులుగా కమిటీ వేశారు. పరీక్షల నిర్వహణ బాధ్యతను కమిటీ పర్యవేక్షిస్తోంది.

విజయనగరం జిల్లాలో భర్తీ చేసే పోస్టులు: 5,915 
-దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు: 1,00,783 మంది 
-జిల్లాలో పరీక్షా కేంద్రాలు: 198
-పరీక్షలను నిర్వహించేందుకు రూటు ఆఫీసర్లు: 61మంది 
-ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు:  20 బృందాలు 
-చీఫ్‌ సూపరింటెండెంట్‌లు: 272 మంది,
-అడిషనల్‌ చీఫ్‌ సూపరింటెండెంట్‌లు: 128 మంది
-సెంటర్‌ స్పెషల్‌ ఆఫీసర్లు: 198 మంది
-హాల్‌ సూపరింటెండెట్లు : 1082 మంది  
-వెన్యూ కో– ఆర్డినేటర్లు: 97 మంది
-ఇన్విజిలేటర్లు:  3,042 మంది
-పోలీసు బందోబస్తు: 600 మంది

 రేపటి నుంచి పరీక్షలు..
విజయనగరం జిల్లాలో  సెప్టెంబర్‌ 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 14  పరీక్షల్లో 10 పరీక్షలు ఇంగ్లిష్, తెలుగు భాషల్లోను, 4 పరీక్షలు కేవలం ఇంగ్లిష్‌లో జరుగుతాయి. 
-సెప్టెంబర్‌ 1వ తేదీ ఉదయం 198 పరీక్ష కేంద్రాల్లో 58,812 మంది అభ్యర్థులు పరీక్షలకు  హాజరవుతారు. ఆ రోజు మధ్యాహ్నం విజయనగరం జిల్లా కేంద్రంలో 22 పరీక్ష కేంద్రాల్లోను, పార్వతీపురంలో 12 పరీక్ష కేంద్రాలను కలిపి 34 కేంద్రాల్లో 11,139 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు. 
-సెప్టెంబర్‌ 3 నుంచి 8వ తేదీ వరకు విజయనగరం జిల్లా కేంద్రంలో మాత్రమే పరీక్షలు జరుగుతాయి.  విజయనగరానికి సంబంధించి 47 కేంద్రాల మ్యాపులను తయారుచేసి హెల్ప్‌డెస్క్‌ల ద్వారా ఆటో డ్రైవర్లకు పంపిణీ చేశారు. అభ్యర్థులను సమయానికి పరీక్ష కేంద్రాలకు తరలించేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 
- సెప్టెంబర్‌ 3వ తేదీ ఉదయం 19  పరీక్ష కేంద్రాలలో 6,655 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 10 పరీక్ష కేంద్రాల్లో 4,383 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. 
-సెప్టెంబర్‌ 4వ తేదీ ఉదయం 3 పరీక్ష కేంద్రాల్లో 1336 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం 2 పరీక్ష కేంద్రాల్లో  739 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. 
- సెప్టెంబర్‌ 6వ తేదీ ఉదయం రెండు పరీక్ష కేంద్రాల్లో 1178 మంది అభ్యర్థులు, మధ్యాహ్నం ఒక పరీక్ష కేంద్రంలో 560 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు.
-సెప్టెంబర్‌ 7వ తేదీ ఉదయం 13  పరీక్ష కేంద్రాల్లో 6,858 మంది అభ్యర్థులు మధ్యాహ్నం ఒక పరీక్ష  కేంద్రంలో 134 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు.
-సెప్టెంబర్‌ 8వ తేదీ ఉదయం 3 పరీక్ష కేంద్రాలలో 2,574 మంది అభ్యర్థులు మధ్యాహ్నం 16 పరీక్ష కేంద్రాలలో 6,424 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. 

పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి..
పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 198 పరీక్ష కేంద్రాల్లో 13 పరీక్ష కేంద్రాలలో దివ్యాంగులు పరీక్షలకు  హాజరవుతున్నట్లు  గుర్తించారు. వారిక పరీక్ష కేంద్రం నుంచి వారి స్థానం వరకు గ్రామ వలంటీర్ల సహాయంతో తీసుకుని వెళ్లేందుకు వీల్‌ చైర్‌లు ఏర్పాటు చేశారు. పరీక్షలకు హాజరవుతున్న అంధులైన అభ్యర్థులకు పదవ తరగతి విద్యార్థులను సహాయకులుగా  నియమించారు. విజయనగరంలో 47 కేంద్రాలు గూగుల్‌ మ్యాప్, కేంద్రాల జాబితా డీటీసీతో ఆటో యూనియన్ల వారికి, పత్రిక విలేకరులకు అందించేందుకు ఏర్పాటు చేశారు. మండల కేంద్రాల్లోని బస్టాండులో రైల్వేస్టేషన్లు, కలెక్టరేట్‌ సర్కిల్‌లో హెల్ప్‌ డెస్క్‌లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. పోలీసు శాఖ భద్రతతో పాటు అంగన్‌వాడీ, ఆశ వర్కర్లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. పరీక్ష పత్రాలు ఇప్పటికే మండల పరిషత్‌ కార్యాలయాల్లో స్ట్రాంగ్‌రూమ్‌లకు చేరుకున్నాయి. అక్కడ పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.

నియమనిబంధనలు ఇలా...
-పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరు. ఉదయం 10గంటలు, మధ్యాహ్నం 2.30 గంటల లోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. 
-ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు  అనుతించబడవు. 
-పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌ టికెట్‌తో పాటు ఏదైనా ఐడెంటిటీ కార్డుతో హాజరుకావాలి.
-రాష్త్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తున్నందున అభ్యర్థులు ఎటువంటి ప్రలోభాలకు లోనుకావద్దని, మధ్యవర్తుల మాటలు నమ్మవద్దని, ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరుగుతుందని సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, అధికారులు ఇప్పటికే ప్రకటించారు. 
-ప్రతి పరీక్ష కేంద్రంలో పరీక్ష జరుగుతున్న విధానాన్ని కెమేరాల ద్వారా పర్యవేక్షిస్తారు. పార్వతీపురం, సాలూరు, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, ఎస్‌.కోట, విజయనగరం క్లస్టర్లుగా విభజించి అన్ని విభాగాలను సమన్వయ పరిచి అధికారులు పర్యవేక్షిస్తారు.

బస్సు సర్వీసులు ఇలా... 
విజయనగరం అర్బన్‌: వరుస సెలవులు, మరోవైపు సచివాలయ పరీక్షలతో జిల్లాలో వారం రోజుల పాటు ప్రయాణికుల రద్దీ పెరగనుంది. ఆర్టీసీకి పండగ వాతావరణం వచ్చింది. సెప్టెంబర్‌ 1 నుంచి 8వ తేదీ వరకు జిల్లాలో నిర్వహిస్తున్న సచివాలయ కార్యదర్శి పోస్టులకు జిల్లాలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పోస్టులు భారీగా ఉండడంతో అభ్యర్థులు అధికమంది దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులకు వీలుగా జిల్లా వ్యాప్తంగా 140 బస్సులను ఆర్టీసీ ప్రత్యేకంగా కేటాయించింది. ఈ మేరకు ప్రత్యేక సర్వీసుల వివరాలను ఆర్టీసీ నార్త్‌ ఈస్ట్‌ కోస్ట్‌ ఆర్‌ఎం ఎ.అప్పలరాజు విడుదల చేశారు.

-గుమ్మలక్ష్మీపురం, కురుపాం, పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి ప్రాంతాలకు 5 బస్సులు
-కురుపాం, పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి ప్రాంతాలకు 5 బస్సులు 
-గుమ్మలక్ష్మీపురం, పార్వతీపురం, సీతానగరం, బొబ్బిలి ప్రాంతాలకు 6 బస్సులు
-కొమరాడ, పార్వతీపురం, సీతానగరం బొబ్బిలి ప్రాంతాలకు 5 బస్సులు
-గరుగుబిల్లి, పార్వతీపురం, సీతానగరం బొబ్బిలి ప్రాంతాలకు 5 బస్సులు
-పార్వతీపురం, బొబ్బిలి, బలిజిపేట ప్రాంతాలకు 3 బస్సులు
-పార్వతీపురం, బొబ్బిలి, రామభద్రపురం, గజపతినగరం, బొండపల్లి, విజయనగరం ప్రాంతాలకు 10 బస్సులు 
-సాలూరు, మక్కువ, సీతానగరం, పార్వతీపురం ప్రాంతాలకు 3 బస్సులు 
-సాలూరు– మక్కువల మధ్య రెండు, సాలూరు–పాచిపెంటల మధ్య మూడు, సాలూరు–విజయనగరం మధ్య 6 ప్రత్యేక సర్వీసులు 
-సాలూరు, రామభద్రపురం, బలిజిపేట మధ్య 2 బస్సులు 
-సాలూరు, రామభద్రపురం, బాడంగి, తెర్లాం ప్రాంతాలకు 4 సర్వీసులు
-సాలూరు, రామభద్రపురం, పార్వతీపురం ప్రాంతాలకు 3 సర్వీసులు 
-సాలూరు, బాడంగి, ఉత్తరావిల్లి, గరివిడి, నెల్లిమర్ల, విజయనగరం, భోగాపురం ప్రాంతాలకు కలిపేందుకు 2 బస్సులు 
-సాలూరు, బాడంగి, ఉత్తరావిల్లి, గరివిడి, నెల్లిమర్ల,  విజయనగరం, పూసపాటిరేగ ప్రాంతాలకు రెండు బస్సులు 
-సాలూరు, తెర్లాం, ఉత్తరావిల్లి, గరివిడి, నెల్లిమర్ల, విజయనగరం, భోగాపురం ప్రాంతాలకు 6 సర్వీసులు
-సాలూరు, తెర్లాం, ఉత్తరావిల్లి, గరివిడి, నెల్లిమర్ల, విజయనగరం, పూసపాటిరేగ ప్రాంతాలకు 6 బస్సులు 
-భోగాపురం, డెంకాడ, విజయనగరం, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, చీపురుపల్లి 5 బస్సులు, అలాగే పూసపాటిరేగ, డెంకాడ, విజయనగరం, నెల్లిమర్ల, గుర్ల, గరివిడి, చీపురుపల్లి వైపుగా 5 బస్సులు వేశారు. 
-దత్తిరాజేరు, గజపతినగరం, విజయనగరం కలిపేందుకు 6, విజయనగరం, గజపతినగరం, మెంటాడ మధ్య 5, ఎస్‌.కోట, జామి, విజయనగరం మధ్య 6, విజయనగరం, జామి, ఎస్‌.కోట మద్య రెండు బçస్సులు నడపనున్నారు. 
-విజయనగరం, చీపురుపల్లి, విజయనగరం, డెంకాడ మద్య 6, విజయనగరం, భోగాపురం మధ్య 5, విజయనగరం, పూసపాటిరేగ మధ్య 5 బస్సులు వేశారు.
-కొత్తవలస, విజయనగరం మధ్య రెండు, ఎస్‌.కోట, ఎల్‌.కోట, కొత్తవలస మధ్య 4 బస్సులు వేశారు. అలాగే, వేపాడ, ఎస్‌.కోట, జామి, విజయనగరం మధ్య నాలుగు, ఎస్‌.కోట, గంట్యాడ మధ్య 6 బస్సులు వేశారు. 
-ఇవి కాకుండా మండల అభివృద్ధి అధికారుల అత్యవసర అవసరాలను దృష్టిలో పెట్టుకొని అందుబాటులో మరిన్ని ఉంచామని ఆర్‌ఎం అప్పలరాజు తెలిపారు. 

మరిన్ని వార్తలు