బాబు మాయమాటలు నమ్మొద్దు

15 Mar, 2014 03:47 IST|Sakshi

నగరి, న్యూస్‌లైన్: ఆల్ ఫ్రీ అంటూ చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని, వీటిని నమ్మి ప్రజలు మోసపోరాదని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్య నిర్వాహక మండలి సభ్యురాలు రోజా సూచించారు. ఆమె శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలతో నగరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొత్తపేట నుంచి టవర్‌క్లాక్ సెంటర్ వరకు ర్యాలీగా వచ్చారు.

అక్కడ వైఎస్‌ఆర్ విగ్రహానికి పూల దండలు వేసి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వని ఆయన నేడు 5 రూపాయలకు అన్నం పెడతాననడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారమే లక్ష్యంగా చంద్రబాబు బూటకపు వాగ్దానాలు చేస్తున్నారన్నారు.

పుత్తూరును మున్సిపాలిటీ చేసి ప్రజలను కష్టపెట్టిన ముద్దుకృష్ణమ నాయుడు నగరి మున్సిపాలిటీని రద్దు కోరడం ఓట్ల రాజకీయమే అన్నారు. ఏ రోజైనా వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. టీడీపీని గెలిపించడానికి మాజీ మంత్రి చెంగారెడ్డి కార్యకర్తలను ఇండిపెండెంట్లుగా బరిలోకి దింపుతున్నారన్నారు. ఇలాంటి నాయకులు వార్డుల్లో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు నిలదీయాలని ప్రజల కు సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కేజేకుమార్, మున్సిపల్ కన్వీనర్ బీఆర్వీ అయ్యప్పన్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు రహమాన్, స్థానిక నాయకులు నీలమేఘం, జైలాబ్దీన్, రాజలింగం, పీవీ గంగాధరం, రమేష్‌రెడ్డి, వెంకటరత్నం, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు పి.యుగంధర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కేజేసురేష్, టికే.హరిప్రసాద్, కన్నాయిరం, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు