హైదరాబాద్: కొత్త రాష్ట్రం ఏర్పాటు తథ్యమని తేలిన తర్వాత వ్యతిరేకించడానికి ఏముంటుందని మజ్లిస్ ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటును తాము వ్యతిరేకించబోమని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లు భవిష్యత్లో రెండు రాష్ట్రాల్లోనూ అమలు చేయాలన్నది తమ డిమాండని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో తెలుగుతో సమానంగా ఉర్దూ భాషను అధికార భాషగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రెండు రాష్ట్రాల్లోనూ తమ పార్టీ శాఖలుంటాయని తెలిపారు. హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చేందుకు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పోలవరం తరహాలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్రాన్ని అసదుద్దీన్ కోరారు. ఆంధ్రప్రదేశ్ను విభజిస్తే, అత్యధికంగా లాభపడేది బీజేపీ అనే విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనతో బీజేపీకే లాభం అన్నారు. కొత్తరాష్ట్రాలలో టీడీపీ బలహీనపడుతుందని అభిప్రాయపడ్డారు. బీజేపీకి దీటుగా తమ పార్టీ నిలబడుతుందని చెప్పారు.