రెచ్చిపోయిన అచ్చెన్నాయుడు

11 Sep, 2019 09:27 IST|Sakshi
ఎస్పీ విక్రాంత్ పటేట్‌ను తిడుతున్న అచ్చెన్నాయుడు

సాక్షి, అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పోలీసు ఉన్నతాధికారిపై నోరు పారేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పోలీసులపై చిందులు తొక్కారు. ‘ఛలో ఆత్మకూరు’ పిలుపు నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందస్తుగా 144 సెక్షన్‌ విధించారు. బుధవారం చంద్రబాబు నివాసానికి వచ్చిన అచ్చెన్నాయుడు, మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారిలను పోలీసులు అడ్డుకున్నారు. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్‌ అమల్లో ఉన్నందున లోపలకు వెళ్లనీయబోమని వారికి ఎస్పీ విక్రాంత్ పటేల్ సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. రెచ్చిపోయిన ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు.. ‘ఏయ్‌ ఎగస్టా చేయొద్దు. నన్ను ఆపడానికి నీకు ఎవడిచ్చాడు హక్కు’ అంటూ పోలీసులపై ఒంటికాలిపై లేచారు. ఎస్పీ విక్రాంత్ పటేట్‌ను ‘యుజ్‌లెస్ ఫెలో’ అని తిట్టారు. పోలీసులు ఆపుతున్నా వినకుండా తోసుకుంటూ ముందుకు సాగిపోయారు.


సీఎం ఇంటికి వెళ్లనీయరా!: నన్నపనేని

ఎన్నికల్లో తమ పార్టీ ఘోరంగా ఓడినా టీడీపీ నాయకులు మాత్రం ఇంకా అధికారంలోనే ఉన్నట్టు భ్రమ పడుతున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి బుధవారం చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 144 సెక్షన్‌ అమల్లో ఉండటంతో చంద్రబాబు నివాసం వద్ద ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. ‘సీఎం​ ఇంటి​కి వెళ్లడానికి అభ్యంతరం ఏంటి’ అని పోలీసులను ఆమె ప్రశ్నించడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. పాపం.. ఆవిడ ఇంకా టీడీపీ అధికారంలో ఉన్నట్టుగానే భావిస్తున్నారని జనాలు జోకులు వేసుకుంటున్నారు. అధికారం కోల్పోయి చంద్రబాబు పదవి పోయినా ‘పచ్చ’ నాయకులకు మాత్రం ఆయన సీఎంగానే కన్పిస్తుండటం విడ్డూరంగా ఉందని ప్రజలు నవ్వుకుంటున్నారు. (చదవండి: బాబు నివాసం వద్ద టీడీపీ నేతల ఓవరాక్షన్‌)

మరిన్ని వార్తలు