మేనమామను హత్య చేసిన మేనల్లుడు

30 Sep, 2015 03:24 IST|Sakshi

కత్తులతో దాడిచేసి హత్య
మృతుని తల్లి బంధువులే సహకరించారని భార్య ఫిర్యాదు


 గుంటూరు రూరల్ : ఆస్తి వివాదం, ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాల నేపథ్యంలో మేనల్లుడు మేనమామను కత్తితో పొడిచి అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన నగరంలో మంగళవారం రాత్రి చోటు  చేసుకుంది. సంఘటనా స్థలిలో మృతుని భార్య గుంజి ఆదిలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం శివనాగరాజు కాలనీ సెల్ టవర్ ప్రాంతానికి చెందిన గుంజి రాంబాబు(35) ఆటో తోలుకుని జీవిస్తుంటాడు. అతనికి భార్య ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత నెల రోజులుగా రాంబాబుకు అతని తల్లికి, అక్కకు, ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం జరుగుతోంది. దీంతో ప్రతి రోజు ఇంటికి వచ్చి వాళ్లు ఆతనితో వాదులాడుతుండేవారు.

ఈ నేపథ్యంలో ఓ చోరీ కేసులో అరెస్టయిన రాంబాబు మేనల్లుడు తమ్మిశెట్టి శ్రీనివాస్ నాలుగు రోజుల క్రితం  బెయిల్‌పై ఇంటికి వచ్చాడు. శ్రీనివాస్, రాంబాబు తల్లి, అక్క, మరో మహిళతో కలిసి మంగళవారం రాత్రి తమ ఇంటికి వచ్చి తన భర్త రాంబాబుతో వాదులాడుతుండగా శ్రీనివాస్ ఓ భారీ కత్తిని తీసుకుని  రాంబాబును పొడిచేందుకు సిద్ధమయ్యాడని, తాను రెండుసార్లు అడ్డగించానని ఆదిలక్ష్మి తెలిపింది. దీంతో తనను నెట్టి తన భర్త రాంబాబును రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి, రాంబాబు తల్లి, మరోమహిళ తన భర్త చేతులు వెనుకకు విరిచి పట్టుకోగా శ్రీనివాస్ కత్తితో ఛాతీ, పొట్ట భాగాల్లో విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యాడని ఆదిలక్ష్మి చెప్పింది.

తీవ్రగాయాలైన తన భర్త అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతి చెందాడని వాపోయింది. విషయం తెలిసి ఏఎస్పీ వెంకటప్పలనాయుడు,అరండల్‌పేట సీఐ శివప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలికి చేరుకున్నారు. హత్యజరిగిన తీరును స్థానికులను, మృతుని భార్యను అడిగి తెలుసుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు