చిన్నారిపై లైంగిక దాడి యత్నం కేసు విచారణ

28 Jun, 2015 02:17 IST|Sakshi

ఏకపాదంపల్లి (తాడిమర్రి) : మండలంలోని ఏకపాదంపల్లి గ్రామంలో ఇటీవల ఆరేళ్ల చిన్నారిపై జరిగిన లైంగికదాడికి యత్నం కేసును శనివారం తహశీల్దార్ రామకృష్ణయ్య విచారణ చేశారు. అనంతపురం నగరంలోని మహిళా పోలీస్‌స్టేషన్ ఏఎస్‌ఐ సుభద్రమ్మ, స్థానిక ఏఎస్‌ఐ ప్రసాద్ బాధిత చిన్నారి, ఆమె  తల్లిదండ్రులను తహశీల్దార్ ఎదుట హాజరు పరిచి కేసు వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులను విచారించారు. ఘటన ఎలా జరిగింది? గ్రామంలో ప్రజలను విచారించారా? నిందితుణ్ణి అదపులోకి తీసుకున్నారా అని ఆయన పోలీసులను అడిగారు.

నిష్పక్ష పాతంగా కేసు దర్యాప్తు చేసి నిజా, నిజాలను నిగ్గుతేల్చి దోషిని శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. స్పందించిన పోలీసులు నిందితుణ్ణి అదుపులోకి తీసుకున్నామని, కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. తొలుత ఈ ఘటన పోలీసులు తహశీల్దార్‌కు చెప్పటడంతో ఆయన అవాక్కయ్యారు. ఈ నెల 20న ఘటన జరిగితే తనకు ఎవ్వరూ తెలపలేదని మండిపడ్డారు. గ్రామంలో జరిగిన ఘటనపై సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదా అని వీఆర్‌వో రాజశేఖర్‌ను మందలించారు.

>
మరిన్ని వార్తలు