ఆటోకు నిప్పు పెట్టుకున్న డ్రైవర్‌

30 Sep, 2019 05:13 IST|Sakshi

పోలీసులు నంబర్‌ కేటాయించకపోవడమే కారణం

పుట్టపర్తి టౌన్‌: పోలీసులు తన ఆటోకు నంబర్‌ కేటాయించలేదన్న కోపంతో డ్రైవర్‌ ఆటోకు నిప్పు పెట్టాడు. ఈ సంఘటన ఆదివారం అనంతపురం జిల్లా పుట్టపర్తిలో చోటు చేసుకుంది. పుట్టపర్తిలో తిరిగే కొన్ని ఆటోల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని భావించిన పోలీసులు కొత్త పద్ధతి తీసుకొచ్చారు. ఆటోలకు నంబర్లు కేటాయించి.. వాటిని మాత్రమే పట్టణంలో తిరిగేందుకు అనుమతులు ఇచ్చారు. ఇంకా 150 ఆటోలకు వివిధ కారణాలతో నంబర్లు కేటాయించలేదు.

ఇలా నంబర్‌ లేని డ్రైవర్లు తమ ఆటోలకు నంబర్లు కేటాయించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డీఎస్పీకి, సీఐకి వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం కనిపించలేదు. ఈ క్రమంలో పుట్టపర్తిలోని సాయినగర్‌కు చెందిన నాగేంద్ర ఆదివారం మధ్యాహ్నం తన ఆటోకు నిప్పుపెట్టుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికే ఆటో కాలిపోయింది. దీంతో పోలీసులు నాగేంద్రను అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు