గల్లంతైన యువకుని మృతదేహం లభ్యం

27 Jun, 2015 02:07 IST|Sakshi

పాలకొండ: రేగిడి మండలం సంకిలి గ్రామం వద్ద రెండ్రోజుల కిందట నాగావళి నదిలో గల్లంతైన రాజాం మండలం బుచ్చంపేట గ్రామానికి చెందిన యువకుడు  కోనాడ తిరుపతిరావు (22) మృతదేహం లభ్యమైంది. పాలకొండ మండలం అంపిలి గ్రామ పరిసరాల నాగావళి నదిలో మృతదేహం ఉండటాన్ని శుక్రవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై ఎల్.చంద్రశేఖర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అలాగే రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, పాలకొండ నగర పంచాయతీ సమన్వయకర్త పల్లా కొండలరావులు మృతదేహం వద్దకు చేరుకుని పరిశీలించారు. మృతదేహం బాగా కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో నది ఒడ్డునే శవపంచనామ, పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహంపై గాయాలైనట్టు ప్రాథమికంగా గుర్తించారు. కేసును రేగిడి పోలీసులకు రిఫర్ చేయనున్నట్టు పాలకొండ ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
 
 యువకుని మృతిపై దర్యాప్తు
 రేగిడి : రాజాం నగర పంచాయతీ బుచ్చెంపేటకు చెందిన యువకుడు కోరాడ తిరుపతి నాగవళి నదిలో గల్లంతై మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతిరావుతోపాటు మంగళాపురానికి చెందిన వడ్డాది వినోద్, పొనుగుటివలసకు చెందిన పూతిక సింహాచలంలు కూడా నదిలో స్నానానికి వెళ్లారు. తిరుపతిరావు ప్రమాదవశాత్తు నీటిలో పడి గల్లంతయ్యాడా, ఇంకేమైనా సంఘటన జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎన్.కామేశ్వరరావు విలేకరులకు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత వాస్తవం వెలుగు చూస్తుందన్నారు.

మరిన్ని వార్తలు