‘దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండాలన్నది సీఎం లక్ష్యం’

7 Jul, 2019 18:20 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఏ సమాజం అయినా విద్యతోనే అభివృద్ది చెందుతుందని, దేశంలోనే విద్యారంగంలో ప్రథమ స్థానంలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గం కంచరపాలెం మెట్టు వద్ద డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సులో పాల్గొన్న మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం గడిచిన ఏళ్లలో ఎన్నో అక్రమాలు చేయడమే కాకుండా సంతలో పశువుల్లా 23 మంది ఎమ్మేల్యేలను కొనడం హాస్యాస్పదం అన్నారు.

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయసాధనకు వైఎస్‌ జగన్‌ ఎన్నో పథకాలను రూపొం‍దించడం హర్షణీయమన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు ప్రతిపేదవాడికి అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రానున్న ఐదేళ్లలో 20లక్షల ఇళ్ల నిర్మాణం, విద్య ఉపాధి అవకాశాలను ముఖ్యమంత్రి కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతిని డ్వాక్రా మహిళా సంఘాలు ఘనంగా సత్కరించగా.. జీవీఎంసీ అధికారులు, వివిధ వార్డుల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు జియ్యని శ్రీధర్‌, నమ్మి నాగేశ్వర రావు, రత్నాకర్‌, ముర్రు, వాణి, నానాజీ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు