విశాఖ చేరుకున్న అవినాష్‌ మృతదేహం

8 Jun, 2019 11:05 IST|Sakshi
కొడుకు అవినాష్‌ మృతదేహంపై పడి విలపిస్తున్న తండ్రి కోన వెంకటరావు

శోక సంద్రంలో కుటుంబ సభ్యులు

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): ఇటీవల అమెరికా నూజెర్సీలోని సరస్సులో గల్లంతై మృతిచెందిన ఉక్కునగరానికి చెందిన అవినాష్‌(32) మృతదేహం శుక్రవారం విశాఖకు చేరుకుంది. విశాఖ విమానాశ్రయంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొడుకు మృతదేహాన్ని చూసిన తండ్రి కోన వెంకటరావు కన్నీరు మున్నీరయ్యారు. అవినాష్‌ 2014లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడని, 2016 అగస్టులో ఇక్కడికి వచ్చి మమ్మల్ని చూసి మళ్లీ వెళ్లాడన్నారు. మే 28న అవినాష్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపామని... ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని తండ్రి వాపోయారు. అక్టోబర్, నవంబర్‌లో వివాహం చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నామని, ఇంతలోనే ఈ ఘోరం చోటు చేసుకుందని కన్నీరుమున్నీరయ్యారు. ఈ రాత్రి మృతదేహాన్ని స్టీల్‌ప్లాంట్‌ ఆస్పత్రిలో ఉంచి శనివారం ఉదయం ఉక్కునగరంలో అత్యక్రియలు జరుపుతామని తెలిపారు. సీఐటీయూ నాయకుడు నర్సింగరావు మాట్లాడుతూ అవినాష్‌ కుటుంబం సభ్యులకు సానుభూతి తెలిపారు.

>
మరిన్ని వార్తలు