పోలియోను తరిమేద్దాం

20 Jan, 2014 05:08 IST|Sakshi

 కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: ప్లేగు వ్యాధి తరహాలో పోలియో మహమ్మారిని కూడా సమాజం నుంచి తరిమికొడదామని చిన్ననీటిపారుదల మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. మొదటి విడత పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం స్థానిక ప్రకాష్‌నగర్‌లోని ప్రకాశం పంతులు స్మారక మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మంత్రి టీజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1995 నుంచిపోలియో చుక్కలు వేసే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 1950లో ప్లేగు వ్యాధి విజృంభించి ఊళ్లకు ఊళ్లే నాశనమై పోయాయని, అయితే ఆ వ్యాధిని సైతం సంపూర్ణంగా నిర్మూలించామన్నారు.
 
 అదే తరహాలోనే పోలియోను కూడా నిర్మూలించాలన్నారు. ఈ సంవత్సరం పల్స్‌పోలియో  విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. నంద్యాలలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, కల్లూరు పీహెచ్‌సీలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, స్థానిక ఎ.క్యాంపులోని మున్సిపల్ హైస్కూల్‌లో జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డిలో పల్స్ పోలియో కార్యక్రమాలను ప్రారంభించారు.
 
 కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి కర్నూలు నగరంలోని పలు పల్స్‌పోలియో కేంద్రాలను సందర్శించారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ వై. నరసింహులు ఓర్వకల్లు, నన్నూరు, లొద్దిపల్లి, ఉయ్యాలవాడ, బి.తాండ్రపాడు గ్రామాల్లో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఇతర జిల్లా అధికారులు సైతం వారికి కేటాయించిన నియోజకవర్గాలు, ప్రాంతాల్లో కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
 

మరిన్ని వార్తలు