జీఏడీ ఆదేశాలపై ఉద్యోగుల విస్మయం
సాక్షి, అమరావతి: జనవరి 26న గణతంత్ర దినోత్సవమని...ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవమని ఊహ తెలిసిన ప్రతి ఒక్కరు ఇట్టే చెబుతారు. కానీ..రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలనశాఖ (ప్రొటోకాల్ విభాగం) అధికారులకు ఈ రెండింటికీ మధ్య తేడాలు తెలియకపోవడం పలువురి ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
జనవరి 26న స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న వేడుకలకు హాజరు కావాలంటూ ఆశాఖ అధికారులు బుధవారం అన్ని ప్రభుత్వ విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం..గణతంత్ర దినోత్సవాల మధ్య తేడా తెలియని సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్) అధికారుల తీరుపై పలువురు ఐఏఎస్ అధికారులు, సచివాలయ ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.