‘కాంగ్రెస్‌తో పొత్తంటే బట్టలూడదీసి కొడతారు’

23 Aug, 2018 18:25 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : వచ్చే ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్‌ పార్టీతో జత కట్టనున్నాయనే వార్తల నేపధ్యంలో టీడీపీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిందే, కాంగ్రెస్‌ అరాచకాల్ని అరికట్టడానికి.. అలాంటిది పోయిపోయి ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపితే, జనాలు బట్టలు ఊడదీసి తంతారంటూ మంత్రి అయ్యన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గురువారమిక్కడ ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడానికని గుర్తు చేశారు.

ఎన్టీ రామారావు తెలుగుదేశం జెండా పట్టుకుని తిరిగింది కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టడానికేనన్నారు. అలాంటిది కాంగ్రెస్‌తో చేతులు కలిపే పరిస్థితి వస్తే, అంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదని మండిపడ్డారు. కాంగ్రెస్‌తో చేతులు కలిపితే ప్రజలు క్షమించడం కాదు కదా.. మనల్ని మనమే క్షమించుకోలేమని తెలిపారు. కాంగ్రెస్‌తో పొత్తు అంటే జనాలు గుడ్డలూడదీసి కొడతారని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు తప్పు చేస్తున్నారని తాను అనుకోవటం లేదని, ఒకవేళ నిజంగా ఆయనే కాంగ్రెస్‌తో పొత్తు అంటే అంతకంటే భయంకరమైన తప్పు మరొకటి ఉండదన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌తో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఒక వేళ అటువంటి పరిస్థితే వస్తే, మొట్టమొదట దాన్ని వ్యతిరేకించేది తానేనని ప్రకటించారు.

మరిన్ని వార్తలు