సాక్షి,చల్లపల్లి(అమరావతి) : ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చే చంద్రబాబును నమ్మితే అరచేతిలో స్వర్గం చూపిస్తాడని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొత్తమాజేరు ప్రధాన కూడలిలో వైఎస్సార్సీపీ జెండా దిమ్మను పార్థసారథి, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి వల్లభనేని బాలశౌరి, అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో రాష్ట్రాన్ని లక్షన్నర కోట్ల అప్పుల్లో ముంచిన చంద్రబాబు, ఎంతసేపూ తన కొడుక్కి కోట్లు కూడబెట్టే పనిలో లీనమయ్యారని విమర్శించారు.
ఎన్నికల ముందు వెయ్యి రూపాయలిచ్చి అన్నదాత సుఖీభవ అంటున్న చంద్రబాబు రైతు రుణమాఫీ 4, 5 విడతల బకాయిలు ఎప్పుడిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రైతులకు గిట్టుబాటు ధర, సాగునీరు ఇవ్వని చంద్రబాబును రైతులు నమ్మే పరిస్థితి లేదన్నారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు, బీసీ డిక్లరేషన్ బడుగు బలహీన వర్గాలు అన్ని రకాలుగా అభివృద్ధి సాధించేందుకు తోడ్పడతాయన్నారు. బాలశౌరి మాట్లాడుతూ నాడు తల్లి కాంగ్రెస్–పిల్ల కాంగ్రెస్ అన్న చంద్రబాబు ఇప్పుడు రాహుల్తో బాబాయ్–అబ్బాయ్లా తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకొల్లు నరసింహారావు, బాలకోటేశ్వరరావు, అన్నపరెడ్డి వెంకటస్వామి, మండల పార్టీ అధ్యక్షుడు వేమూరి గోవర్థనరావు, జిల్లా కార్యదర్శులు బొందలపాటి లక్ష్మి, షేక్ దిల్షాద్ నజరానా, అబ్దుల్కరీం, మేడూరి శ్రీనివాసరావు, అరజా శివశంకర్, వడుగు నందులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.