సాక్షి, గజపతినగరం రూరల్: ఏ తల్లి కన్నదో ఆ బిడ్డను. నవమాసాలు మోసి... ప్రసవవేదన అనుభవించి... చివరకు జన్మనిచ్చింది. కానీ ఆ బిడ్డ వారికి బరువైందో... మృతశిశువును కన్నదో... పుట్టిన బిడ్డ ఊపిరాగిందో... లేక ఏ ప్రబుద్ధుడి మోసానికి బలై అన్యాయంగా తల్లిగా మారిందో... కానీ ఓ మగబిడ్డను నిర్దాక్షిణ్యంగా రోడ్డు పక్కన కాలువలో పడేశారు. నీటిలో తేలియాడితూ పసికందు మృతదేహం మంగళవారం ఉదయం వెలుగు చూసింది. గజపతినగరం రైల్వేస్టేషన్ సమీపంలో జాతీయ రహదారి వద్ద చిన్న పాటిగా ఉన్న లోతట్టు ప్రాంతంలోని నీటిలో తేలియాడుతున్న ఆ పసికందు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి మధుపాడ వీఆర్ఓ దాసరి అప్పలరాజుకు సమాచారం అందించారు. ఆయన గజపతినగరం పోలీస్ స్టేషన్కు తెలియజేయడంతో సీఐ విద్యాసాగర్, ఎస్ఐ సన్యాసినాయుడు అక్కడకు చేరుకొని మృతశిశువును పరిశీలించారు. అనంతరం ఆ మృతశిశువును శవపంచనామాకోసం తరలించారు. అయితే ఆ బిడ్డ మృతి చెంది మూడు లేదా నాలుగు రోజులు అయి ఉండవచ్చని ప్రాథమికంగా ఆస్పత్రిలో పరిశీలించిన గజపతినగరం సూపరింటెండెంట్ డాక్టర్ అరుణా దేవి తెలిపారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు తెలిపారు.