బాబు హామీల పాపం..డ్వాక్రా సంఘాలకు శాపం

24 Aug, 2014 03:33 IST|Sakshi
బాబు హామీల పాపం..డ్వాక్రా సంఘాలకు శాపం

పలమనేరు: డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామంటూ బాబు ఇచ్చిన హామీ గ్రూపుల్లో మహిళల పాలిట శాపంలా మారింది. ఇన్నాళ్లు రుణాలు మాఫీ చేస్తారనే ఆశతో తీసుకున్న అప్పులను గ్రూపులు బ్యాంకులకు చెల్లించలేదు. దీంతో అసలు, వడ్డీ పెరిగి వీరికి మరింత భారంగా తయారైంది. నాలుగు నెలల వడ్డీ ఒక్కసారి కట్టాల్సి రావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. బ్యాంకర్లు సైతం మొత్తం కంతులు కట్టాల్సిందేనంటూ గట్టిగానే చెబుతున్నారు. దీనికితోడు సంఘమిత్రలు గ్రూపు లీడర్లపై మరింత ఒత్తిడి తీసుకొస్తున్నారు.
 
4 నెలల వడ్డీ భారం రూ.25 కోట్లు

 
చిత్తూరు జిల్లాలో 55,602  స్వయం సహాయక సంఘాలు రూ.1611.03 కోట్లు (మార్చి 31 నాటికి) బ్యాంకులకు బకాయిపడ్డాయి. మే నుంచి ఆగస్టు వరకు ఈ సంఘాలు బ్యాంకులకు కం తులు చెల్లించలేదు. 4నెలల వడ్డీతోపాటు అసలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరికి సంబంధిత బ్యాంకులు 13.5 శాతం వడ్డీతో అంటే నూటికి రూ.1.27 చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఈ లెక్కన నెలకు 5.7 కోట్లు వడ్డీ చెల్లించాల్సి ఉంది.

నాలుగు నెలలకు కలిపి సుమారు రూ.25 కోట్లకు పైగా గ్రూపులు వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి నె లకొంది. ఇక మహిళా గ్రూపులు ఔట్‌స్టాండింగ్‌గా సుమారు రూ.150 కోట్లు దాకా చెల్లించాల్సి ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. మరోవైపు అసలు, వడ్డీ చెల్లించలేని గ్రూపులను నాన్  పెర్ఫార్మెన్స్ అకౌంట్స్ ద్వారా బ్లాక్ లిస్టులోకి చేర్చే కార్యక్రమం కూడా ఇప్పటికే జరిగిందని తెలుస్తోంది. జిల్లాలో 8 వేల సంఘాలు ఓవర్ డ్యూ కారణంగా కొత్త రుణాలు పొందలేని పరిస్థితి ఏర్పడింది. వీరు ఇన్‌డేట్‌కు మొత్తం కంతులు చెల్లిస్తే గానీ వీరి ఖాతా రెగ్యులర్ అకౌంట్‌గా మారి ఫోర్స్‌లోకి రావు.
 
అసలు, వడ్డీ కలిపి కట్టాల్సిందే..
 
రాష్ర్ట ప్రభుత్వం నుంచి డ్వాక్రా రుణాలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు రాలేదని, జీవో సంతృప్తి కరంగా లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. అసలు ప్ర భుత్వం అందిస్తున్న రూ.లక్ష రుణమాఫీనే కాదని,  గ్రూపుల బలోపేతానికి ప్రోత్సాహకమేనని ఇండియ న్ బ్యాంక్ జోనల్ మేనేజర్ చంద్రారెడ్డి పేర్కొన్నారు. అసలు, వడ్డీ కలిపి కడితేగానీ ఖాతాలా వాదేవీలు ఫోర్స్‌లోకి రావంటూ గట్టిగానే చెబుతున్నారు. భవిష్యత్తులో కొత్తరుణాలు పొందాలంటే కచ్చితంగా కంతులు చెల్లించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.
 
గ్రూపుల్లోని పొదుపు ఖాతాలపై బ్యాంకర్ల కన్ను
 
రుణమాఫీ సంగతి పక్కనుంచి సంబంధిత గ్రూపుల్లో ని పొదుపు ఖాతాలకు మాత్రం పొదుపును జమ చే యాల్సిందేనని అటు ఐకేపీ, ఇటు మెప్మా అధికారు లు, బ్యాంకర్లు మొదటి నుంచి చెబుతూనే వస్తున్నా రు. 60 శాతం సంఘాలు ప్రతినెలా సేవింగ్స్ ఖాతా లో పొదుపును జమ చేస్తూనే వస్తున్నాయి. ప్రతి గ్రూపునకూ నెలకు రూ.వెయ్యి చొప్పున బ్యాంకుల కు రూ.60 లక్షలకు పైగా జమ అవుతోంది. ఆ లెక్కన 4 నెలలుగా రూ.2.04 కోట్లు పొదుపు ఖాతాల్లో ఉన్నాయి. ఈ డబ్బును సైతం అప్పుల్లోకి జమ వేసుకోవడానికి బ్యాంకర్లు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
 
అసలు, వడ్డీ కట్టాలని సంఘమిత్రల హుకుం..
 
ఒక వైపు బ్యాంకర్లు ఒత్తిడి తెస్తుంటే మరో వైపు సంఘమిత్రలు అసలు, వడ్డీ మొత్తం కట్టాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందే రూ.లక్ష వచ్చాక మిగిలిన అప్పు చెల్లిస్తామని గ్రూపు లీడర్లు చెబుతున్నా పట్టించుకోకుండా వేధిస్తున్నట్లు పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. మొత్తం మీద  చంద్రబాబు హామీ కారణంగా తాము అప్పుల పాలయ్యామని చాలా మంది మహిళలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
 

>
మరిన్ని వార్తలు