ముళ్ల పొదలో నిర్జీవ శిశువు

13 Mar, 2019 12:10 IST|Sakshi
ముళ్ల కంపలో పడి ఉన్న పసికందు మృతదేహం

సాక్షి, పెద్దదోర్నాల: పేగు తెంచుకొని పుట్టిన ఆ పసి బిడ్డ ఏ తల్లికి భారమయ్యాడో ఏమో.. 9 నెలలు పాటు తల్లి కడుపులో పెరిగి బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టిన తర్వాత మాత్రం ముళ్ల పొదల మధ్య నిర్జీవంగా కన్పించాడు. కుక్కలు పీక్కు తినటంతో ఓ కాలు, ఓ చేయి లేని శిశువు మాంసం ముద్దలా మారి మంగళవారం సాయంత్రం నిర్జీవంగా స్థానికుల కంట పడింది. ఈ సంఘటన మండల పరిధిలోని ఐనముక్కల సమీపంలో కర్నూల్, గుంటూరు ప్రధాన రహదారి పక్కనే చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఐనముక్కల వద్ద నిరుపయోగంగా ఉన్న ఎమ్మార్సీ భవనం ఎదురుగా ఉన్న చిల్ల చెట్లలో శిశువు మృతదేహం పడి ఉన్న వార్త వ్యాపించడంతో పరిసర ప్రాంత ప్రజలు సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఆకర్షిణీయంగా ఉన్న ఆ మగ శిశువు పదునైన ముళ్ల కంపలో పడి ఉండటాన్ని చూసి.. చిన్నారిని అలా పడేయడానికి ఆ తల్లిదండ్రులకు ఎలా మనస్సు వచ్చిందంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశువు బతికి ఉండగానే భారమని అక్కడ పారవేశారా లేక పుట్టిన వెంటనే ప్రాణం పోవడంతో తీసుకొచ్చి ఇక్కడ పడేశారా అని చర్చించుకున్నారు. కాగా చనిపోయిన మృతశిశువును అక్కడే ఉన్న మట్టికుప్పలో నామమాత్రంగా పూడ్చి వేయటం వల్ల  మృత శిశువును కుక్కలు బయటకు లాక్కొనివచ్చి ఉంటాయని మరి కొందరు భావిస్తున్నారు. మృత శిశువు పడి ఉన్న విషయాన్ని పోలీసులకు తెలియజేయటంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఎస్సై సుబ్బారావు మాట్లాడుతూ సమీప గ్రామంలో రెండు రోజుల క్రితం ఓ మహిళ మృత శిశువుకు జన్మనిచ్చి ప్రస్తుతం వైద్యశాలలో చికిత్స పొంతున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

మరిన్ని వార్తలు