అయ్యో..పాపం

5 Dec, 2019 12:27 IST|Sakshi
మ్యాన్‌హోల్‌లో పడి ఉన్న శిశువు మృతదేహం

మ్యాన్‌హోల్‌లో నవజాత శిశువు మృతదేహం

ప్రసూతి ఆస్పత్రి వెలుపల ఘటన

చిత్తూరు, తిరుపతి తుడా : తిరుపతిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ప్రాంగణంలోని మ్యాన్‌హోల్‌లో బుధవారం  నవజాత శిశువు మృతదేహం కలకలం రేపింది. వివరాలు..ఆస్పత్రిలోని మరుగుదొడ్ల నీళ్లు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో ఎక్కడైనా బ్లాక్‌ అయ్యింటుందని భావించిన పారిశుధ్య కార్మికులు బుధవారం ఉదయం మ్యాన్‌హోల్స్‌పై దృష్టి సారించారు. ఒక్కొటొక్కటే శుభ్రం చేస్తూ ఆస్పత్రి వెలుపల ఓ మ్యాన్‌హోల్‌లో శుభ్రం చేసేందుకు పూనుకున్నారు. ఇంతలో అక్కడ శిశువు మృతదేహం ఉన్నట్లు గుర్తించారు.

సిబ్బంది మ్యాన్‌హోల్‌లోని శిశువు మృతదేహాన్ని వెలికి తీశారు. సమాచారం చేరవేయడంతో అధికారులు అలిపిరి పోలీసులకు తెలియజేశారు. పోలీసులు కేసు నమోదు చేసి అనుమానిత వ్యక్తులెవరైనా మ్యాన్‌హోల్‌లో బిడ్డను పడేశారా? లేదా మృతి చెందిన శిశువును ఇంటికి తీసుకెళ్లలేక మ్యాన్‌హోల్‌లో పడేశారా? అనే దానిపై ఆరా తీస్తున్నారు. మంగళవారం ప్రసూతి ఆస్పత్రిలో ప్రసవ సమయంలో ముగ్గురు శిశువులు మృతి చెందినట్లు అధికారులు ఆధారాలు వెలికితీశారు. ఇందులో ఒక మగబిడ్డ, ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో ఓ ఆడశిశువును ఇంటికి తీసుకెళ్లకుండా  మంగళవారం రాత్రి మ్యాన్‌హోల్‌లో వేసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పోలీసులు విచారణలో నిజానిజాలు తేలాల్సింది. మొత్తానికి ఇది చర్చకు దారితీసింది.

మరిన్ని వార్తలు