పేకాట ఆడుతూ దొరికిపోయిన ఓ పార్టీ నేత

25 Jun, 2014 22:18 IST|Sakshi

హైదరాబాద్: బాలానగర్ జోనల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట స్థావరాలపై చేస్తున్న దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. నిన్న కండ్లకోయలోని గోదాములో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసిన ఘటన మరువక ముందే తాజాగా బుధవారం దేవరయాంజాల్‌లో ఓ ఫామ్ హౌస్‌లో కొంపల్లికి చెందిన ఓ పార్టీ నేత ఆదిరెడ్డి మోహన్‌రెడ్డి, మేడ్చల్‌కు చెందిన రామిరెడ్డి, జగన్ రెడ్డిలతో పాటు మరికొంత మంది పేకాట ఆడుతున్న విషయం జోనల్ టాస్క్‌ఫోర్స్ బృందానికి సమాచారం అందింది.

దీంతో బాలానగర్ డీసీపీ ఎ.ఆర్.శ్రీనివాస్ ఆదేశాల మేరకు పేట్ బషీరాబాద్ సీఐ ప్రవీందర్‌రావు నేతృత్వంలో దాడులు నిర్వహించారు. అప్పటికే పోలీసులు రాకను గమనించిన కొంతమంది పరారు కాగా మోహన్‌రెడ్డి, రామిరెడ్డి, జగన్‌రెడ్డిలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి రూ. 26 వేల నగదు, రెండు కార్లు, మూడు సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్టేషన్‌కు తీసుకువచ్చిన ఆ ముగ్గురినీ పలువురు పత్రికా ఫొటోగ్రాఫర్లు ఫొటోలు తీస్తుంటే మీ ఇష్టం వచ్చినట్లు రాసుకోండంటూ పోలీసుల ముందే వారు అనడం గమనార్హం.

మరిన్ని వార్తలు