బాలస్వామి సన్యాస స్వీకార మహోత్సవం ఆరంభం

16 Jun, 2019 04:27 IST|Sakshi
అమ్మవారికి పూజలు చేస్తున్న స్వరూపానందేంద్ర స్వామి, కృష్ణానదిలో పుణ్యస్నానం ఆచరిస్తున్న కిరణ్‌కుమార్‌ శర్మ

సాక్షి, విజయవాడ/తాడేపల్లిరూరల్‌ (మంగళగిరి) : విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా కిరణ్‌కుమార్‌ శర్మ బాలస్వామి సన్యాస స్వీకరణ, పట్టాభిషేక మహోత్సవాలకు.. వేద మంత్రోచ్ఛారణలు, హోమాల మధ్య శనివారం ఉదయం అంకురార్పణ జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి కృష్ణానది కరకట్టవెంట ఉన్న గణపతి సచ్చిదానంద ఆశ్రమం.. సన్యాస స్వీకరణ కార్యక్రమానికి వేదికైంది. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం తొలిరోజు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పర్యవేక్షణలో అంగరంగవైభవంగా జరిగింది సన్యాసదీక్ష స్వీకరిస్తున్న కిరణ్‌కుమార్‌ శర్మ స్వస్థలం విశాఖ జిల్లా భీమునిపట్నం.

1993 ఏప్రిల్‌ 4న ఆయన జన్మించారు. హనుమంతరావు ఇద్దరి కుమారుల్లో పెద్దవాడు కిరణ్‌కుమార్‌ శర్మ. మూడో తరగతి చదువుతున్నప్పుడు తల్లిదండ్రులతో స్వామిజీ ఆశ్రమానికి వచ్చారు. మహాస్వామి కంటికి ఆ బాలుడు అపర శంకరుడుగా గోచరించడంతో పీఠంలో చేర్చాలని తల్లిదండ్రులను మహాస్వామి కోరారు. తర్వాత మహాస్వామికి ప్రధాన శిష్యుడయ్యారు.  అనంతరం స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ శ్రీరాజశ్యామలాదేవి పీఠం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. 

స్వరూపానందేంద్రను దర్శించుకున్న ప్రముఖులు 
రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, జక్కంపూడి రాజా, సినీనటి శారద, సినీ హీరో శ్రీకాంత్, ఊహ దంపతులు స్వామిని దర్శించుకున్నారు.  

మరిన్ని వార్తలు