సీఎం నివాసం వద్ద ఉద్రిక్తత.. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని..

13 Mar, 2019 15:45 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసం వద్ద పెట్రోల్ పోసుకుని ఓ టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేయటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ కార్యకర్తలు, బలిజ కులస్తులు పెద్ద సంఖ్యలో సీఎం నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి సీటిస్తే టీడీపీలో ఉన్న బలిజ నాయకులందరూ మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధమని రాయలసీమ బలిజ మహా సంఘం అధ్యక్షుడు బళ్లారి వెంకట్రాముడు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ప్రభాకర్‌ చౌదరికి వ్యతిరేకంగా బలిజలు సీఎం ఇంటి వద్ద నిరసన చేపట్టారు. ప్రభాకర్‌ చౌదరికి సీటు ఇ‍వ్వకూడదని వారు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు.

ప్రభాకర్ చౌదరి స్థానంలో బలిజలకు సీటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ చౌదరి బలిజలని అణచివేస్తున్నాడని వారు ఆరోపించారు. ప్రభాకర్ చౌదరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఓ టీడీపీ కార్యకర్త ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో పోలీసులు వెంటనే అతన్ని నిలువరించి, అదుపులో​కి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు