కొమ్ముకూర భలే రుచి

1 Aug, 2018 12:29 IST|Sakshi

పశ్చిమ గోదావరి, కొయ్యలగూడెం : వర్షాకాలం ప్రారంభం కావడంతోనే గిరిజనులు ఆతృతగా ఎదురుచూసే వంటకం కొమ్ములు (వెదురు) కూర. వెదురు పిడాల నుంచి మొలిచే గెడల చివరి భాగాన్ని కోసి చిన్న ముక్కలుగా తరిగి వెదురు వంటకం తయారు చేస్తారు. ప్రస్తుతం ఏ గిరిజన గ్రామాల్లో చూసినా ప్రతి ఇంటా కొమ్ములు కూర వండుతుంటారు. ముక్కలుగా తరిగిన వెదురుకు శాఖాహారంగా, మాంసంతో కలిపి వండుతారు. అడవుల్లోకి వంట చెరకు కోసం వెళ్లే మహిళలు వస్తూ తప్పనిసరిగా వెదురు కొమ్ములను వెంట తెచ్చుకుంటారు.

తంగెళ్లగూడెం, బిల్లిమిల్లి, వంకాబొతప్పగూడెం, కిచ్చప్పగూడెం, మర్రి గూడెం గ్రామాల్లోని మహిళలు ప్రస్తుతం కొమ్ము కూరల వంటకంపైనే దృష్టిసారిస్తున్నారు. రుచిగా ఉండే కొమ్ము కూర శరీరంలోని కొవ్వును వేగంగా తగ్గిస్తుందని వంకా బొతప్పగూడెం మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ పేర్కొన్నారు. కేవలం వర్షాకాలం మూడు నెలల్లో ఇవి విరివిగా లభిస్తాయని తెలిపారు. ఆవు కొమ్ములు మాదిరిగా అడుగున్నర పొడవున వెదురు పిడాల్లో ఇవి మొలుస్తుంటాయని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు