ఆగ్రహించిన బ్యాంకు ఉద్యోగులు

19 Dec, 2013 07:04 IST|Sakshi

ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ పిలుపు మేరకు బుధవారం బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. అధికారులు కూడా సంఘీభావం తెలుపడంతో జిల్లాలో సుమారు 300 బ్యాంకు శాఖలు మూతబడ్డాయి. దీంతో  వేల కోట్ల రూపాయల నగదు లావాదేవీలు నిలిచిపోయాయి. ఏటీఎంలలో కూడా నగదు నిల్వలు లేక పోవడంతో ఖాతాదారులు ఇబ్బందులు పడ్డారు. ఒంగోలు నగరంలోని బ్యాంకు ఉద్యోగులు స్థానిక భాగ్యనగర్‌లోని ఆంధ్రాబ్యాంకు జోనల్ కార్యాలయం నుంచి నెల్లూరు బస్టాండ్ వద్ద గల, సిండికేట్ బ్యాంకు వరకు ప్రదర్శనగా వచ్చి సభ నిర్వహించారు.
 
 ఏఐబీఈఏ నాయకుడు వి.పార్థసారధి మాట్లాడుతూ 10వ వేతన సవరణ ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని, ఎఫ్‌డీఐలను వ్యతిరేకించాలని, బ్యాంకింగ్ సెక్టార్‌లో వస్తున్న నూతన సవరణలను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. మెడికల్ ఇన్సూరెన్సు ఖర్చులన్నీ బ్యాంకులే భరించాలన్నారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సర్దార్ మాట్లాడుతూ ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్న నూతన ఆర్థిక విధానాలను ఆపివేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. నగర కో-ఆర్డినేషన్ సమితి ప్రధాన కార్యదర్శి వి.రామచంద్రరావు (రాము) నాయకులను ఆహ్వానించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ యూపీఏ-2 ప్రభుత్వం ఎల్‌ఐసీ, బ్యాంకుల్లో ఎఫ్‌డీఐలను అనుమతిస్తూ ప్రభుత్వ వాటాలను తగ్గిస్తూ, బ్యాంకులను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. కార్పొరేషన్ సంస్థలకు బ్యాంకింగ్ లెసైన్సులివ్వడాన్ని వ్యతిరేకించారు.
 
 ధరలు విపరీతంగా పెంచుతూ, ద్రవ్యోల్బణానికి లెక్కలు కల్పించిన ప్రభుత్వం, వేతన సవరణలో 5 శాతం మాత్రమే వేతనం పెంచుతామనడం దారుణమన్నారు. 10వ వేతన సవరణ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే కారుణ్య నియామకాలు జరపాలని కోరారు. ఉద్యోగులు పోరాటాల ద్వారా బ్యాంకింగ్ రంగాన్ని కాపాడుకోవాలని కోరారు. బ్యాంకుల విలీనాలను వ్యతిరేకించాలని కోరారు. నగరంలోని 50 పైగా బ్యాంకు శాఖలన్నీ మూతబడ్డాయని.. ఎస్‌బీఐలోని క్లియరింగ్ హౌస్ పని చేయలేదని, 2000 కోట్లపై చిలుకు నగదు లావాదేవీలు నిలిచిపోయాయని నిర్వాహకులు తెలిపారు. జిల్లాలోని మార్కాపురం, చీరాల, కందుకూరు, కనిగిరి, గిద్దలూరు, కొండపి, పర్చూరు తదితర అన్ని ప్రధానమైన ప్రాంతాల్లో స్వీపర్ మొదలుకొని, మేనేజర్ల స్థాయి వరకు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని సంఘీభావం తెలిపారన్నారు.
 
 కార్యక్రమంలో  లక్ష్మయ్య, యు.ప్రకాశరావు, సీహెచ్ శ్రీనివాసరావు, ఎ.సుధాకరరావు, యు.వేణుగోపాల్, కె.రాజేశ్వరరావు, వి.ఆంజనేయులు, మల్లికార్జునరావు, సీహెచ్ శోభన్‌బాబు, పి.నరసింహ, కె.జానకిరామయ్య, ఎ.వేణుగోపాలరావు, డి. కోటేశ్వరరావు, ఎం.నరేంద్రబాబు, పి.బ్రహ్మయ్య, వి.వి.రమణమూర్తి, టీఎల్ ప్రసాద్, వంశీకృష్ణ, బి.వెంకటేశ్వర్లు, పి.వెంకటేశ్వర్లు, ఉమాపతి, కె.వి.రమణయ్య, డి.శశిధర్, కె.హనుమంతరావు నాయక్, బి.సురేంద్రబాబు, జిలానీ, చైతన్య, ఆర్.డేవిడ్‌కింగ్,లక్ష్మీమాధవి, ఇందు, జి. శ్రీనివాసులు, రమణకుమార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు