చంద్రబాబూ.. రైతుల జీవితాలతో వ్యాపారం చేస్తారా?

23 Feb, 2017 15:54 IST|Sakshi
చంద్రబాబూ.. రైతుల జీవితాలతో వ్యాపారం చేస్తారా?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో 7 లక్షల ఎకరాల భూసేకరణకు సిద్ధమైనట్టు ప్రకటించిందని, తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. రైతుకు, భూమికి ఉన్న బంధం తెలియదా? అని ప్రశ్నించారు. భూసేకరణ పేరుతో రైతుల పొట్టగొట్టి, పెద్దలకు కట్టబెట్టే యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.

ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీ చేయకపోగా, రైతుల నెత్తిన అధిక భారం మోపారని విమర్శించారు. రైతుల జీవితాలతో వ్యాపారం చేస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు తన వైఖరి మార్చుకోకుంటే తగిన గుణపాఠం తప్పదని బ్రహ్మానందరెడ్డి హెచ్చరించారు.