జగన్‌ను ఆదర్శంగా తీసుకోవాలి

6 Jan, 2020 04:07 IST|Sakshi

ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య సూచన

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% పైగా పదవులు కల్పించడం అభినందనీయం

కర్నూలు (సెంట్రల్‌): బీసీలకు నిర్మాణాత్మక, రాజ్యాంగబద్ధమైన పదవులను కల్పించడంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆదర్శంగా తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా తన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం, నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం కల్పించడం అభినందనీయమన్నారు.

ఆదివారం ఆయన కర్నూలులోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా జనాభా ప్రకారం చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గతేడాది పార్లమెంట్‌లో బీసీలకు 50% రిజర్వేషన్ల కోసం ప్రవేశపెట్టిన బిల్లుకు బీజేపీ మద్దతు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. దేశంలో 14 బీసీ పార్టీలు ఉన్నాయని, వాటికి రాని ఆలోచన  వైఎస్సార్‌సీపీకి రావడం గొప్ప విషయమని అన్నారు. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లోనూ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.

మరిన్ని వార్తలు