పులులెన్నున్నాయ్...!

21 Jan, 2014 02:13 IST|Sakshi

 నల్లమల అభయారణ్యంలో పులుల లెక్కింపు అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సాగుతున్నాయి. నాలుగేళ్లకోమారు సాగే ఈ గణనను 2006 లో చేపట్టినప్పుడు మొత్తం 39 ఉన్నట్లు లెక్కతేలింది. ఆ తర్వాత 2010లో చేపట్టిన లెక్కల ప్రకారం వీటి సంఖ్య 53 నుంచి 67కు చేరుకున్నాయని అధికారులు గుర్తించారు. తాజాగా ఈ నెల 18నుంచి ప్రారంభమైన ఈ గణన 25వ తేదీ వరకు సాగనుంది. ఈ మారు వీటి సంఖ్య ఎంతకు పెరుగుతుందో చూడాలి.
 
 అచ్చంపేట, న్యూస్‌లైన్:
 ప్రతి నాలుగేళ్లకొకసారి జరిగే పులుల లెక్కింపు ప్రక్రియ నల్లమల అభయారణ్య ప్రాంతంలో ప్రారంభమైంది. పులులు, చిరుతలు, ఇతర జంతువులతో పాటు పక్షుల లెక్కలు కూడా ఇందులో తేలనున్నాయి. ఈ ప్రక్రియ ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు జరుగుతుంది. అటవీశాఖ కూడికలు, తీసివేతల ప్రకారం పులులు, చిరుతల లెక్కలు చెబుతున్నారే తప్ప వాస్తవంగా ఎన్ని ఉన్నాయనే విషయం ఎవరికీ తెలియదు. జాతీయ పులుల సంరక్షణ యాజమాన్యం(ఎన్‌టీసీఏ)పరిధిలో ఉన్న 44 టైగర్ ప్రాజెక్టుల పరిధిలో 2010లో పులుల గణ న జరిగింది. పులులు సంచరించిన ప్రాం తాల నుంచి పాదముద్రల(ప్లగ్ మార్కుల)ను సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో విశ్లేషించిన తరువాత పులుల సంఖ్యలో ఓ అంచనాకు వస్తారు.
 
 శ్రీశైలం- నాగార్జునసాగర్ ఆభయారణ్యంలో 53 నుంచి 67 పులులు ఉన్నట్లు గతంలో జరిగిన గణనలో తేల్చారు. అయితే ఈలెక్కలపై కేంద్ర ప్రభుత్వం విశ్వసించడం లేదని ఇక నుంచి కెమెరా ట్రాప్ మానిటరింగ్ టెక్నాలజీ ద్వారానే గణన జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అటవీశాఖ ఇందుకు అవసరమైన లైనింగ్ ఏర్పాటు చేసింది. పులుల గణన పాదముద్రల ద్వా రా జరుగుతోంది. ఇవీ అత్యధింగా నీటి వనరులు ఉన్నా ప్రాంతంలో కనిపిస్తాయి. కాగా, లోతట్టు అటవీప్రాంతంలో పులుల గణన జరగడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. నాగార్జునసాగర్ - శ్రీశైలం రాజీవ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మహబూబ్‌నగర్, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, నల్గొండ జిల్లాల పరిధిలో 5928 చ.కి మేర విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో 2006 లెక్కింపు ప్రకారం 39 పులులు ఉన్నాయి.
 
 లెక్కించడం ఇలా..
 నల్లమల అటవీప్రాంతం విస్తరించి ఉన్న అచ్చంపేట, ఆత్మకూర్, మార్కాపూర్, నాగార్జునసాగర్ పరిధిలో 149 బీట్లలో వెయ్యిమంది అటవీశాఖ అధికారులు, సిబ్బంది పులుల గణనలో పనిచేస్తున్నారు. అచ్చంపేట, అమ్రాబాద్, మన్ననూర్, లింగాల అటవీశాఖ రెంజ్‌ల పరిధిలో 70 బీట్లలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతిబీట్‌లో ఇద్దరు చొప్పున పనిచేస్తున్నారు. పులుల లెక్కింపు, పరి శీలనలో అటవీశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. వారంరోజుల పాటు జరిగే పులుల గణనలో సెక్షన్ అధికారు లు, బీట్ అధికారులు, టైగర్ ట్రాకర్స్ పాల్గొంటా రు. వీరు బృందాలుగా విడిపోయి గణన చేస్తారు. పులులు, చిరుత పులులు ప్లగ్ మార్కులు(గుర్తు)ను సేకరించి కం ప్యూటర్‌లో నమోదుచేసిన అనంతరం వాటి వివరాలను వెల్లడిస్తారు. పుల్లాయిపల్లి, దేవునిసరిగడ్డ, ఫర్హాబాద్, బాణాల, బిల్లకల్లు, చౌటపల్లి బీట్లతో పాటు ఇతర ప్రాం తాల్లో ప్రస్తుతం గణన జరుగుతోంది. ఇక ఇప్పుడైనా  స్పష్టమైన లెక్క తేలుస్తారో లేదో వేచిచూడాలి.
 

మరిన్ని వార్తలు