ప్రతిభకు పదును పెడితే గెలుపు

26 Dec, 2014 01:33 IST|Sakshi
ప్రతిభకు పదును పెడితే గెలుపు

 రాజమండ్రి సిటీ :ప్రతిభను గుర్తించి, తగిన శిక్షణ ఇస్తే అత్యుత్తమ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుల్ని తయారు చేయవచ్చని చైనాకు చెందిన కోచ్ ఇన్‌వియ్ పేర్కొన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి, శిక్షణ ఇచ్చే పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (అజ్మీర్)లో ఆయన కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. రాజమండ్రిలో జరుగుతున్న 76వ జాతీయ కేడెట్, సబ్ జూనియర్ అంతర్రాష్ట్ర టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌కు పీఎస్‌పీబీ కోచ్‌గా ఆయన హాజరయ్యారు. గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ 1995 నుండి 2003 వరకూ పీఎస్‌పీబీలో క్రీడాకారులకు శిక్షణ ఇచ్చానని, 2014 అక్టోబర్‌లో మళ్లీ కోచ్‌గా చేరానని చెప్పారు.
 
 ఇప్పటివరకు పీఎస్‌పీబీలో సుమారు 40 మందికి శిక్షణ ఇవ్వగా 50 శాతం మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారన్నారు. ఈ టోర్నీలో గుర్తించిన మెరికల్లాంటి క్రీడాకారుల్ని ఏపీటీటీఏ సహకారంతో తన వెంట శిక్షణకు తీసుకువెళతానన్నారు. చైనా, జపాన్, అమెరికా వంటి దేశాల్లో 6, 7 ఏళ్ల వయసు నుంచే శిక్షణ ప్రారంభిస్తారన్నారు. శారీరక దారుఢ్యం, పట్టుదల, ఏకాగ్రత గుర్తించి మరింత ఉత్తమ శిక్షణ ఇస్తారన్నారు. ప్రతిభావంతులు చదువుకు తక్కువ సమయం, ఆటల్లో శిక్షణకు ఎక్కువ సమయం వెచ్చించే వెసులుబాటు ఉంటుందన్నారు. ఉత్తమ క్రీడాకారులు చదువులో వెనుకబడినా వారిని చైనా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. శిక్షణ సమయంలో ఎక్కడ తప్పు జరిగినా అక్కడ నుంచే మళ్లీ శిక్షణ మొదలు పెడతామన్నారు. భారత దేశంలో మంచి క్రీడాకారులున్నారని, వారికి మెరుగైన శిక్షణ ఇస్తే విశ్వవిజేతలు కాగలరని అన్నారు.
 
 జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధిస్తా
 ఇప్పటివరకూ కేడెట్‌గా 6 నేషనల్ గేమ్స్‌లో పాల్గొన్నా. 2011-12లో గాంధీ ధామ్‌లో జరిగిన కేడెట్ నేషనల్ టోర్నీలో సిల్వర్, 2012-13లో అజ్మీర్‌లో జరిగిన నేషనల్ కేడెట్ టోర్నీలో బ్రాంజ్ మెడల్‌స సాధించా. అమ్మానాన్నల ప్రోత్సాహంతో విజయాలు సాధిస్తున్నా. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధిస్తా. భవిష్యత్‌లో ఇంజినీర్ అవుతా.
 - ఎస్.మహిమా చౌదరి, 8వ తరగతి,
 ఏపీ టీమ్ సభ్యురాలు, స్టేట్ 3వ ర్యాంకర్, విజయవాడ
 
 ఒలింపిక్స్‌లో ఆడాలని ఉంది
 గోల్డ్ మెడల్ సాధించాలి. నా తండ్రి ఆటో డ్రైవర్ అయినా టీటీపై మక్కువతో నిత్యం శిక్షణ ఇప్పించడం వల్లే నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను. ఒలింపిక్స్‌లో ఆడాలని ఉంది. భవిష్యత్‌లో క్రీడాకారిణిగా దేశానికి ఖ్యాతి  తీసుకు వస్తా. 2013-14లో మినీ కేడెట్ స్టేట్ రన్నర్‌గా నిలిచా. తాతయ్య, అమ్మ ప్రోత్సాహం వల్లే ఆటల్లో పాల్గొన గలుగుతున్నా.
 - ఆర్.ఆదిలక్ష్మి, 6వ తరగతి,  కేడెట్ ఆంధ్రా టీమ్ కెప్టెన్,
 
 2014-15 స్టేట్ చాంపియన్, విజయవాడ
 క్రీడాకారునిగా గుర్తింపే లక్ష్యం
 మంచి క్రీడాకారునిగా గుర్తింపు తెచ్చుకుంటా. జాతీయ స్థాయిలో మంచి ప్లేయర్‌ను అవుతా. దేశానికి, సొంత ఊరు విజయవాడకు పేరుతెస్తా.  భవిష్యత్‌లో ఉద్యోగం చేయను. వ్యాపారం చేస్తా.
 - షా అక్షిత్,
 కేడెట్ ఫస్ట్ ర్యాంకర్, విజయవాడ
 

మరిన్ని వార్తలు