18 నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ

8 Dec, 2019 12:34 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ప్లాస్టిక్‌ను నిషేధించామని, భవానీలెవరూ కొండపైకి ప్లాస్టిక్ కవర్లను తీసుకురావద్దని దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు సూచించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షా విరమణ కార్యక్రమం ఈ నెల 18 నుంచి 22 వరకు జరగనుందని తెలిపారు. దీక్షా విరమణ రోజుల్లో తెల్లవారుజామున మూడు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం కొనసాగుతుందని పేర్కొన్నారు. అమ్మవారి దర్శనార్థం ఏడు లక్షల మంది భవానీలు వస్తారని అంచనా వేశారు. బుధవారం నాడు జరిగే కలశ జ్యోతి మహోత్సవానికి జ్యోతుల ఊరేగింపులో హాజరయ్యే భక్తులు ఘాట్‌ రోడ్డు మీదుగా కాకుండా కనకదుర్గా నగర్‌ మీదుగా రావాలని విజ్ఞప్తి చేశారు. భవానీల కోసం ఘాట్‌ రోడ్డు మీదుగా క్యూలైన్‌లతో పాటు గిరి ప్రదక్షిణ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో భవానీల కోసం మూడు హోమగుండాలను ఏర్పాటు చేశామన్నారు. 

మరిన్ని వార్తలు