విజయనగరంలో ‘భీమవరం బుల్లోడు’యూనిట్ సందడి

4 Mar, 2014 03:24 IST|Sakshi
విజయనగరంలో ‘భీమవరం బుల్లోడు’యూనిట్ సందడి


  ఆశీర్వదించండి
  విజయనగరం టౌన్, న్యూస్‌లైన్: ‘మీ ఆశీర్వాదాలుంటే సినిమా ఇండస్ట్రీలో దూసుకెళ్తాను. యాక్షన్ నుంచి కామెడీ వరకూ ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నా’ అంటూ భీమవరం బుల్లోడు సునీల్ విజయనగరంలో సోమవారం సందడి చేశారు. చిత్ర విజయోత్సవంలో భాగంగా పట్టణంలోని రంజనీ థియేటర్‌కి సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు చిత్ర యూనిట్ సభ్యులు వచ్చారు. సునీల్ రాకతో థియేటర్ చప్పట్లతో దద్దరిల్లిపోయింది. ప్రేక్షకుల కరతాళ ధ్వనులకు ముగ్ధుడైన సునీల్ మాట్లాడుతూ మంచి చిత్రాలకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని మరోసారి రుజువు చేశారన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో చిత్రం చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. నటనే ప్రాణంగా ఉన్న తనకు ఇంతటి సక్సెస్‌నిచ్చిన అభిమానులకు రుణపడి ఉంటానన్నారు.
 
  అభిమానుల ప్రోత్సాహంతో మరిన్ని మంచి చిత్రాలు చేస్తానని చెప్పారు. పైరసీ రక్కసిని దరిచేరనీయకుండా అభిమానులే చూడాలన్నారు. సినిమా విజయోత్సవ వేడుకలను రాష్ట్రమంతా నిర్వహిస్తున్నామని, సినిమా ప్రదర్శితమవుతున్న ప్రతి జిల్లాకు వెళ్లి వేడుకల్లో స్వయంగా పాల్గొంటున్నానన్నారు. హీరోయిన్ ఎస్తర్ మాట్లాడుతూ ‘సినిమా బాగుందా’ అంటూ ప్రేక్షకులను అడిగి తెలుసుకున్నారు. హాస్యనటులు రాజేష్, పృథ్వీ, సంగీత దర్శకుడు అనూప్ తదితరులు వారి వెంట ఉన్నారు.
 
 
 

మరిన్ని వార్తలు