శిల్పా చక్రపాణిరెడ్డిపై హత్యాయత్నం!

24 Aug, 2017 13:36 IST|Sakshi
నంద్యాలలో శిల్పా చక్రపాణిరెడ్డిపై కాల్పులు!

సాక్షి, నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికకు పోలింగ్‌ పూర్తయి 24 గంటలు కూడా గడవక ముందే  తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతలు ఏకంగా కాల్పులకే దిగారు. నంద్యాల ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా మోహన్‌ రెడ్డి సోదరుడు చక్రపాణిరెడ్డి లక్ష్యంగా కాల్పులు జరిగాయి. గత నెల రోజులుగా టీడీపీ నేతలకు అడ్డగా మారిన సూరజ్‌ గ్రాండ్‌ హోటల్‌ ముందు భూమా వర్గీయుడు, రౌడీ షీట్‌ వున్న అభిరుచి మధు...చక్రపాణి రెడ్డిపై అయిదు రౌండ్ల కాల్పులు జరిపాడు. అంతేకాకుండా చేతిలో కొడవలితో వీరంగం సృష్టించాడు.

ఈ ఘటనలో శిల్పా చక్రపాణి రెడ్డి తప్పించుకోగా భూమా వర్గీయులను శిల్పా వర్గీయులు అడ్డుకున్నారు.  మైనార్టీ నేత చింపింగ్‌ బాషా అంత్యక్రియల కార్యక్రమానికి హాజరైన శిల్పా చక్రపాణిరెడ్డిపై సూరజ్‌ గ్రౌండ్‌ హోటల్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరగడం ప్రకంపనలు రేపుతోంది. కాగా కాల్పులు జరిపిన అభిరుచి మధుపై రౌడీషీట్‌ ఉంది. ఎన్నికల సమయంలో అభిరుచి మధుకు చంద్రబాబు సర్కార్‌ గన్‌మెన్‌లను కేటాయించడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి.