'మాట తప్పినందుకే జగన్ నిలదీస్తున్నారు'

14 Jun, 2016 11:35 IST|Sakshi

విజయవాడ: వైఎస్ఆర్ కుటుంబంపై టీడీపీ దుర్మార్గంగా దాడి చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. విజయవాడలో మంగళవారమిక్కడ జరుగుతున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తి వైఎస్ జగన్ అని, ఆయన వ్యక్తిత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని భూమన మండిపడ్డారు. అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డిపై ...ఇప్పుడు జగన్పై దాడి కొనసాగిస్తున్నారన్నారు. వైఎస్ జగన్పై దాడిని అందరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు. డబ్బులకు అమ్ముడుపోయినవాళ్లు...వైఎస్ జగన్పై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు.

అధికారంలోకి వచ్చి ఒక్క హామీని కూడా నెరవేర్చని చంద్రబాబు పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భూమన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. హామీలు అమలు చేయాలని చంద్రబాబు కాలర్ పట్టుకుని అడగడం తప్పా అని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అని తొలి సంతకం చేసిన చంద్రబాబును నిలదీయడం తప్పా అని అడిగారు. ఇక డ్వాక్రా రుణాలు చేస్తానని మాట తప్పినందుకే వైఎస్ జగన్ నిలదీస్తున్నారన్నారు. వైఎస్ఆర్ ఆశయాల సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని, చంద్రబాబు దాష్టికాలను ప్రజల్లో ఎండగట్టాలని భూమన సూచించారు.

>
మరిన్ని వార్తలు