హడలెత్తించిన పిడుగులు

14 Jul, 2019 08:04 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : వాండ్రంగి, రాపాక పంచాయతీ చీడిపేటలో శనివారం సాయంత్రం కొబ్బరిచెట్లపై పిడుగులు పడ్డాయి. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్లపై మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.  ఇల్లయ్యగారిపేటలో ఓ ఇంటిపై పిడుగు పడిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. సాయంత్రం 4 గంటల సమయంలో ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై ఉరుములు, మెరుపులు వచ్చాయి. దీంతో ప్రజలంతా ఒక్కసారిగా ఇళ్లలోకి వెల్లిపోయారు. అదే సమయంలో నడిమింటి శ్రీరాములు ఇంటి మేడపై ముందుభాగాన పిడుగు పడింది. దీంతో గోడ ధ్వంసమై ఇటుకలు ఊడి బయటపడ్డాయి.  సుమారు రూ. 50 వేలు నష్టం వాటిల్లిందని బాధితులు లబోదిబోమంటున్నారు.  

తుంగపేటలో కూలిన ఇంటిగోడ 
మండలంలోని తుంగపేటలో శనివారం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నాలుగు కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఇంటిగోడ కుప్పకూలింది. ఇటీవల కురిసిన చిరుజల్లులకు గోడ నానడంతో కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని యజమానులు కూన ఇందుమతి, కూన లక్ష్మిన కూన వెంకట సూర్యం, కూన రేవతిలు తెలిపారు.  

మరిన్ని వార్తలు