లాక్‌డౌన్‌: విశాఖలో బిహార్‌ విద్యార్థులు

29 Mar, 2020 09:25 IST|Sakshi
బిహార్‌ విద్యార్థులతో మాట్లాడుతున్న జీవీఎంసీ అధికారులు 

హోటళ్లలో 17 మందిని  గుర్తించిన జీవీఎంసీ అధికారులు

పరీక్షలు నిర్వహించి చర్యలు తీసుకుంటామన్న కమిషనర్‌

సాక్షి,విశాఖపట్నం: నగరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న బిహార్‌ విద్యార్థులను రైల్వే స్టేషన్‌ సమీపంలోని హోటళ్లలో జీవీఎంసీ అధికారులు గుర్తించారు. లాక్‌డౌన్‌ సందర్భంగా కాలేజీ హాస్టల్స్‌ని మూసివేయడంతో తామంతా విశాఖలో చిక్కుకున్నామనీ, 55 మందికి పైగానే ఉన్నామనీ తమని రక్షించాలని కోరుతూ విద్యార్థులు వీడియో పోస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర అధికారులు జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజనకు ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న హోటల్స్‌లో జల్లెడపట్టారు. (అమరావతిలో ‘కరోనా’ అనుమానితులు!)

స్టేషన్‌ సమీపంలోని అర్చన గ్రాండ్‌ హోటల్‌లో ఐదుగురు, రాయల్‌ రాజస్థాన్‌ హోటల్‌లో 12 మంది విద్యార్థులను గుర్తించామని కమిషనర్‌ సృజన తెలిపారు. వీరికి ఉన్నతాధికారుల ద్వారా కౌన్సెలింగ్‌ ఇచ్చామన్నారు. సంబంధిత కళాశాల యాజమాన్యాల్ని సంప్రదించగా.. తాము హాస్టల్స్‌ నుంచి పంపించలేదనీ.. బయటికి వెళ్తామని చెప్పి వచ్చేశారని చెప్పారని కమిషనర్‌ వివరించారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి.. ఎలాంటి ప్రమాదమూ లేదని తెలిశాక హాస్టల్స్‌కి పంపిస్తామనీ, అంతవరకూ హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచనున్నట్లు సృజన వెల్లడించారు.

మరిన్ని వార్తలు