బైకును ఢీకొన్న లారీ

3 Jan, 2014 01:28 IST|Sakshi

 పామూరు, న్యూస్‌లైన్ : బైకుపై ఉన్న ముగ్గురిని మొద్దుల లోడుతో వెళ్తున్న లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఓ వృద్ధురాలు స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ఘటన మండలంలోని బలిజపాలెం వద్ద గురువారం రాత్రి జరిగింది. వివరాలు..
 
 పీసీపల్లి మండలం గుంటుపల్లికి చెందిన కొణి జేటి నవీన్(16) తన అమ్మమ్మ సాతులూరి చెన్నమ్మను ఆమె స్వగ్రామం గుంటూరు లింగన్నపాలెం (వయా బొట్లగూడూరు)లో వదిలి వచ్చేందుకు బయల్దేరాడు. అమ్మమ్మతో కలిసి వాహనం కోసం రోడ్డుపై వేచి ఉన్నాడు. అదే మండలం శంకరాపురాని (మూలవారిపల్లి)కి చెందిన చింతగుంట్ల సీమోను (22) బొట్లగూడూరు వైపునకు బైకుపై వెళ్తున్నాడు. తమను బొట్లగూడూరులో వదలి పెట్టాలని నవీన్, చెన్నమ్మలు కోరడంతో వారిని మోటార్‌సైకిల్‌పై ఎక్కించుకుని బోట్లగూడూరు వెళ్తున్నాడు. బొట్లగూడూరు నుంచి శంకరాపురం వైపు మొద్దుల లోడుతో ఎదురుగా వచ్చిన లారీ మోటార్‌సైకిల్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో నవీన్, చింతగుంట్ల సీమోనులు అక్కడికక్కడే మృతి చెందాడు. నవీన్ అమ్మమ్మ చెన్నమ్మకు స్వల్పగాయాలయ్యాయి. కళ్లముందే తన మనుమడి  మృతిని తట్టుకోలేని చెన్నమ్మ స్పృహకోల్పోయింది. నవీన్ గుంటుపల్లి హైస్కూల్‌లో 10 వ తరగతి చదువుతున్నాడు. సీమోను బేల్దారి కూలి. ఐదు నెలల క్రితమే ఇతనికి దేవి అనే మహిళతో వివాహమైంది. మృతుల బంధువుల ఆర్తనాదాలతో సంఘటన స్థలం మార్మోగింది.
 
 

మరిన్ని వార్తలు