బావిలోకి దూసుకెళ్లిన బైక్

13 Aug, 2013 05:06 IST|Sakshi

 శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: మండలంలోని చెర్లోపల్లె ఎస్సీకాలనీ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న వ్యవసాయబావిలో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ఈ విషయం వెలుగు చూసింది. శ్రీకాళహస్తి పట్టణం ఎన్‌టీఆర్ నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ వంశీకుమార్(26) తిరుపతిలోని పద్మావతిపురంలో ఉంటున్నాడు. ఇతను అప్పుడప్పుడు శ్రీకాళహస్తికి వచ్చివెళ్లేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంలో శ్రీకాళహస్తికి బయలుదేరాడు.

మార్గమధ్యంలో చెర్లోపల్లె ఎస్సీ కాలనీ సమీపంలో రోడ్డుపక్కన 50 అడుగుల లోతున్న వ్యవసాయ బావిలో అదుపుతప్పి పడిపోయి మృతిచెందాడు. సోమవారం ఉదయం స్థానికులు ఇతడి శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ సంజీవ్‌కుమార్‌తో పాటు పలువురు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో బావిలోని స్కూటర్‌ను, మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు