‘బయో’ భయం

30 Jul, 2018 04:02 IST|Sakshi

రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో పడకలు 1.40 లక్షలు

ఒక్కో ఇన్‌పేషెంట్‌ పడక నుంచి సగటున రోజుకు వెలువడే వ్యర్థాలు 250 గ్రాములు

రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల నుండి రోజుకు వెలువడే బయో వ్యర్థాలు 35 టన్నులు

ఆస్పత్రుల నుంచి విడుదలయ్యే వ్యర్థాల నిర్వీర్యం సరిగా లేక వ్యాధుల ముప్పు

జిల్లాల్లో వ్యర్థాల నిర్వీర్యంలో నిబంధనలు తుంగలోకి.. కాంట్రాక్టర్లు, పీసీబీ అధికారుల కుమ్మక్కు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల నుంచి వచ్చే బయో వ్యర్థాల నిర్వీర్యం ఘోరంగా ఉంది. ఈ వ్యర్థాల నిర్వీర్యం సరిగా లేకపోవడంతో హెపటైటిస్‌ బి లాంటి భయంకర వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆస్పత్రుల్లో విడుదలయ్యే వ్యర్థాలను ఎక్కడికక్కడ వేరుచేసి, నిబంధనల మేరకు నిర్దేశించిన ఉష్ణోగ్రతల్లో నిర్వీర్యం చేయాల్సి ఉండగా అలా చేయకుండా వ్యర్థాలను పారపోస్తున్నారు. ప్లాస్టిక్‌ను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాలు అధికారుల దృష్టికి వచ్చినా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. విజయవాడ అరండల్‌పేటలో బయోవ్యర్థాల వాస్తవ స్థితిగతులు ‘సాక్షి’ పరిశీలనలో బయటపడ్డాయి.

ఒక పడక వ్యర్థానికి రూ.4
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒక్కో పడక నుంచి విడుదలయ్యే వ్యర్థాలకు రోజుకు రూ.4 ఇస్తారు. ఒక్కో పడక నుంచి సగటున రోజుకు 250 గ్రాముల వరకు వ్యర్థాలు విడుదలవుతున్నాయి.  రాష్ట్రంలో 10 జిల్లాల్లో ఒక్కో జిల్లాలో సగటున 8 వేల పడకలు ఉండగా, గుంటూరు, కృష్ణా, విశాఖలో మాత్రం ఒక్కో జిల్లాలోనే 20 వేల పడకలున్నాయి. రాష్ట్రం మొత్తం సుమారు 1.40 లక్షల పడకల నుంచి రోజుకు 35 వేల కిలోల బయో వ్యర్థాలు విడుదలవుతున్నాయి.  ఈ వ్యర్థాలను ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే నిర్వీర్యం చేయాలి. కానీ అలా చేయడం లేదు.

ఉదాహరణకు కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకే కాంట్రాక్టర్‌ ఈ నిర్వహణ చేస్తున్నారు. కృష్ణా జిల్లా యూనిట్‌ను గత కొన్ని నెలలుగా నిర్వహించకుండా ఈ వ్యర్థాలను గుంటూరుకు తరలిస్తున్నారు. ఇతర జిల్లాల్లోనూ పరిస్థితులు ఇలానే ఉన్నాయి. అంతేకాకుండా వ్యర్థాల రవాణా, వాటి నిర్వీర్యం విషయంలో ఏ మాత్రం నిబంధనలు పాటించడం లేదు. బయో వ్యర్థాలను నిర్వీర్యం చేసే యూనిట్లలో పనిచేసే సిబ్బందికి కనీస రక్షణ ఉండటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వ్యర్థాల నుంచి విడుదలయ్యే బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల తాము వ్యాధులబారిన పడుతున్నామని సిబ్బంది చెబుతున్నారు.

అధికారులు, కాంట్రాక్టర్ల కుమ్మక్కు
బయో వ్యర్థాల నిర్వీర్యంలో పీసీబీ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కవుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఏసీబీకి దొరికిన అధికారే దీనికి నిదర్శనం. ఈ వ్యర్థాలను నిర్వీర్యం చేసే ప్లాంట్లు ఎలా ఉన్నా, ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటే అమ్ముకుంటున్నా, వీటిని రవాణా చేసే విషయంలో ఎలా వ్యవహరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడి ఒకే కాంట్రాక్టర్‌ ఉంటున్నారు. కొత్త వారిని రానివ్వడం లేదు.

ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో ఒక కాంట్రాక్టర్‌ దరఖాస్తు చేసుకుంటే 25 కేసులు పెట్టారు. చివరకు గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు గెలిచి కాంట్రాక్ట్‌ దక్కించుకోగలిగారు. పీసీబీ అధికారులే వెనకుండి కొత్త కాంట్రాక్టర్‌ను ఇబ్బందిపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. విజయవాడలోని ఓ పీసీబీ అధికారికి వివరణ కోసం ఫోన్‌ చేయగా.. వెంటనే సంబంధిత యూనిట్ల వారికి సమాచారం అందడం గమనార్హం.   

కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు ఇవే..
♦  బయో వ్యర్థాలను తీసుకెళ్లే వాహనాలకు విధిగా జీపీఎస్‌ ఉండాలి.
♦  ఈ వాహనాలకు రూట్‌ చార్ట్‌ ఉండాలి.
♦  ఏ ఆస్పత్రిలో ఎంత బయోవ్యర్థాలు సేకరించారో కాంట్రాక్ట్‌ సంస్థ విధిగా తన వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి.
♦  వ్యర్థాలను సేకరించే పనివారికి ఖచ్చితంగా వ్యాక్సిన్‌ వేయించాలి.
♦  వారికి గ్లౌజులు, ఎన్‌–95 మాస్కులు ఉండేలా చూడాలి.
♦  వ్యర్థాలను నిర్వీర్యం చేసే ప్లాంట్‌లను నిరంతరం అధికారులు పర్యవేక్షించాలి.
♦  సేకరించిన వ్యర్థాలను 48 గంటల్లోగా నిర్వీర్యం చేయాలి

బయో వ్యర్థాల నిర్వహణ ఎలా ఉంటుందంటే..
♦  ప్రతి జిల్లాలో టెండర్ల ద్వారా పీసీబీ ఆధ్వర్యంలో సంస్థను నిర్ణయిస్తారు.
జిల్లాకొక కాంట్రాక్టర్‌ను నిర్ణయిస్తారు. అదే జిల్లాలో వ్యర్థాల నిర్వహణ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకోవాలి.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యర్థాలన్నీ ఏ రోజుకారోజు సేకరించాలి.
ఆస్పత్రిలోనే వ్యర్థాలను వేర్వేరు బ్యాగుల్లో వేసి సంచిని సీల్‌ చేసి బార్‌కోడ్‌ వేస్తారు.
ఆ వ్యర్థాల సంచులను నిర్వీర్యం చేసే ప్లాంట్‌ వరకూ తెరవకుండా తీసుకెళ్లాలి.

వ్యర్థాల నిర్వహణ ఎలా ఉండాలి?
ఆస్పత్రుల నుంచి విడుదలయ్యే వ్యర్థాల్లో నాలుగు రకాలు ఉంటాయి. వీటిని వేర్వేరు బ్యాగుల్లో వేస్తారు. పసుపు పచ్చ బ్యాగులో టాక్సిన్‌ వేస్ట్‌ (విషపూరిత వ్యర్థాలు లేదా అవయవాలు), ఎర్రబ్యాగుల్లో సిరంజిలు, గ్లౌజ్‌ వంటి ప్లాస్టిక్‌వి, తెల్ల బ్యాగుల్లో నీడిల్స్, కత్తులు, నల్లబ్యాగుల్లో ఆహార వ్యర్థాలు తీసుకెళ్లాలి. ముఖ్యంగా ఎర్రబ్యాగుల్లో వేసిన ప్లాస్టిక్‌ను వెయ్యి సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలో కరిగించి, ముక్కలు చేయాలి. దీనికి కేజీకి రూ.10 ఇస్తారు.

ఆసుపత్రుల్లో ఏం జరుగుతోంది
దాదాపు అన్ని జిల్లాల్లో ఈ ప్లాస్టిక్‌ వ్యర్థాలను బ్యాగుల్లో నుంచి తీసి నేరుగా చెత్త సేకరించేవారికి కేజీ రూ.60కు అమ్మేస్తున్నారు. వారు ఈ వ్యర్థాలను స్వల్ప ఉష్ణోగ్రతలో కరిగించి స్ట్రాలు, ప్లాస్టిక్‌ గ్లాసులు, ఐస్‌క్రీమ్‌ కప్పులుగా తయారుచేస్తున్నారు.

నష్టాలేంటి
దీనివల్ల హెపటైటిస్‌ బి, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉంది.

చర్యలు శూన్యం
ఆయా ప్రాంతాల్లోని ప్రజలు బయో వ్యర్థాల వల్ల జబ్బులొస్తున్నాయని పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేస్తున్నా  పట్టించుకోవడం లేదు. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులూ చర్యలు తీసుకోవడంలేదు. విజయవాడ అరండల్‌పేటలో ‘సాక్షి’ పరిశీలనకు వెళ్లగా బ్యాగులు తీసేసి అప్పటికప్పుడే ఇతర ప్రాంతానికి తరలించారు.

మరమ్మతులున్నాయని అనుమతించాం
కృష్ణా జిల్లాలో ఉన్న ప్లాంటు మరమ్మతుకు వచ్చిందంటే 15 రోజులు గుంటూరులోని ప్లాంటులో వ్యర్థాలను నిర్వీర్యం చేస్తామంటే అనుమతి ఇచ్చాం.
– కె.వి.రావు, జాయింట్‌ చీఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్, పీసీబీ, విజయవాడ

అక్కడ పరిస్థితులు దారుణం
నిబంధనల ప్రకారం వ్యర్థాల నిర్వీర్యం జరగడం లేదు. కొన్ని రోజుల కిందటే ఈ ప్లాంట్‌ను చూసి కాంట్రాక్టర్‌కు నోటీసు ఇచ్చాం. బయో వ్యర్థాలు ఓపెన్‌ చేసి ఎక్కువ సేపు ఉంచడం వల్ల వాసనలు వస్తున్నాయి.
– మహేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్, పీసీబీ, గుంటూరు

బయో వ్యర్థాల వల్ల పెను ప్రమాదం
బయో వ్యర్థాలను సరిగా నిర్వీర్యం చేయకపోతే పెను ప్రమాదం పొంచి ఉన్నట్టే. హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ బి, సి, ఎ వంటి వ్యాధులు వస్తాయి. ఆస్పత్రిలో వాడిన కత్తులు, నీడిల్స్, సర్జికల్‌ బ్లేడ్స్‌ కారణంగా టైఫాయిడ్, కలరా, ఇన్‌ఫెక్షన్లు, రుమటిక్‌ ఫీవర్, చర్మసంబంధిత వ్యాధులు వస్తాయి. రక్తం వంటివి ఉన్న బ్యాగులు లేదా, గ్లౌజులు సరిగా నిర్వీర్యం చేయకపోతే ఫైలేరియాసిస్, మలేరియా లాంటి వ్యాధులూ వస్తాయి.
– డా.హరిచరణ్, అసోసియేట్‌ ప్రొఫెసర్, కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాల.

మరిన్ని వార్తలు